మన వివాహ వ్యవస్థ – 4
ఈరోజు మన వివాహ వ్యవస్థను గురించి మాట్లాడేటప్పుడు మన స్మృతి లేక ధర్మ శాస్త్రం, మన వివాహములో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మికత గురించి చూద్దాము. హిందూ వివాహం విడిపోయేందుకు మన ధర్మ శాస్త్రాలు, స్మృతులు అంగీకరించవు. ప్రభుత్వాలు చట్టాలు చేయగలవు కాని ధర్మాన్ని, ధర్మ సూత్రాలను తయారుచేయలేవు.
మనకు దాంపత్యధర్మమున్నది. మంచి కుటుంబ సౌఖ్యము, సత్సంతానము, అతిథి-అభ్యాగతి సేవ, సమాజసేవ ఇవి కనపడేవి. తాత్త్విక చింతన అంటే ఏమిటి? ఈ దాంపత్య వ్యవస్థ తాత్త్విక మార్గమునకు మార్గదర్శనము చేయగలదా? ఇది ప్రశ్న. మన పూర్వీకులైన ఋషులు మన జీవితగతిని యెలా సూచించారో, దానికి అవసరమైన భూమికయే గృహస్థ ధర్మము. ఎప్పటివారు ఈ ఋషులు? ఎప్పటివి ఈశాస్త్రాలు? అనిప్రశ్నిస్తే అది చాలా ప్రాచీనమని చెప్పాలి, వేల సంవత్సరాలు. తపస్సుతో వారు తెలుసుకున్నది సృష్టి జ్ఞానము. మన దృష్టిలో బ్రహ్మము లేదా బ్రహ్మవస్తువు అని చెప్పబడేది శాశ్వతంగా ఉన్నది. దానిలోనించే స్పందన, గుణములు, పంచభూతములు, ప్రకృతిలోని ఇతర తత్త్వములు పుట్టినవి. బ్రహ్మ వస్తువునుండి తమను తాము సృష్టించుకున్నవారు ఆది దంపతులు. ఒకరి తరువాత ఒకరు రాలేదు. ఒకమాటే వచ్చారు. అంటే ఒకటే పురుషుడు, ప్రకృతిగా రెండయింది. పురుషుడు పరమేశ్వరుడు, ప్రకృతి జగన్మాత. ఆ తత్త్వమునుండే దాంపత్యము అనే తత్త్వము పుట్టినది. వారిని ధ్యానిస్తే మన అంతఃకరణలో కూడా ఒక శుభప్రదమైన పరిణామం వస్తుంది.
ఆదికావ్యం, మహాకావ్యం అయిన రామాయణం ఆ కరుణ రసాత్మక శ్లోకంతో ఆరంభమవుతుంది.
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమశ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునా దేక మవధీః కామమోహితమ్'
(ఓ కిరాతుడా! మన్మథ పరవశలు అయి ఉన్న క్రౌంచ పిట్టల జంటలో ఒక దాన్ని నీవు చంపివేసినావు. ఇక నీవు అట్టే కాలము బ్రతకకూడదు) (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు). ఒక పక్షి విషాదాంతాన్ని, రెండవ పక్షి రోదననూ చూచిన వాల్మీకి మహర్షి నోటి వెంట అప్రయత్నంగా ఛందోబద్ధంగా వెలువడిన శ్లోకమిది. ఇది శ్రీమద్రామాయణమునకు మంగళాచరణ శ్లోకము. పక్షి దాంపత్యముతో మొదలుపెట్టి సీతారాముల ఆదర్శ దాంపత్యము వరకు వెళ్ళినది వాల్మీకి మహాకవి రామాయణం. దాంపత్యములో సుఖదుఃఖాలు, సంయోగ వియోగాలు ఉంటాయి. ఈ వివాహ వ్యవస్థ వేల సంవత్సరాలనుండే మన దేశములో ఉన్నది. కేవలము క్రమబద్ధమైన సాంఘికజీవనముకోసమే ఇది నియమబద్ధం చేశారా?
అన్ని మతాలలోనూ వివాహాన్నిగురించిన చర్చలున్నాయి. ఉదహరణకు ఇస్లాంలో ఈ విషయాల చర్చ ఉంటుంది - వైవాహిక ధర్మాలు, వివాహ నిబంధనలు, వివాహానంతరం, వివాహ పద్ధతులు, దాని ధర్మములు, భార్య గుణాలు, వివాహ నిషిద్ధమైన స్త్రీలు, విడాకులు, వివాహ బంధాన్ని నిలుపుకునే, తెంచుకునే స్వేచ్చ, అవిశ్వాసులతో వివాహం, యూద క్రైస్తవ స్త్రీలతో వివాహం వల్ల కలిగే నష్టాలు (
http://teluguislam.net/2011/03/27/fiqh-islami-telugu-islam/) ఇది కేవలం ఒక సాంఘికవిషయం వలెనే కనుపిస్తుంది. క్రైస్తవమతంలోకూడా కొంతవరకు ఇలానే ఉంటుంది. మతాధికారి ఇద్దరిచేత ప్రమాణాలు చేయిస్తాడు. "ఆదం అనే నేను అవ్వ అనే పేరుగల ఈ కన్యను భార్యగా స్వీకరించి, మనసా వాచా కర్మణా ప్రేమిస్తాను. జీవితాంతము వరకు విడువను. క్రీస్తు నాకు ఎలాగో, ఈమెకు నేను అలాగే" అని వరుని చేత, కొంచెం ఇదే తరహా పదాలతో వధువు చేతా ప్రమాణాలు చేయిస్తారు.
హిందూ వివాహాలలో కూడా సంఘపరంగా ఇటువంటివే ఉంటాయి. వధువు గౌరీ పూజ చేస్తుంది. భర్త చిరకాలము జీవించాలని ప్రార్థిస్తుంది. ఇద్దరూ సుఖముగా ఉండాలి. మంచి సంతానం కలగాలి. ఇవి అందరికీ సమానమే. హిందూ వివాహములో ముఖ్యమైన భేదము మనము దేవతల సాక్షిగా చేసుకుంటున్నాము. హోమములు చేసుకునే సాంప్రదాయములోని వారు అగ్నిసాక్షిగా అనిచెబుతారు. వివాహ మంత్రాల ప్రకారము ఆమె దేవతలకు భార్య అయిన తరువాతనే వరుడు ఆమెకు భర్త అవుతాడు. శరీరములో ప్రతి అవయవమునకు అధిదేవతలు ఉంటారు. దేవతలు శాశ్వతముగా శరీరములో ఉండి రక్షిస్తారు. స్త్రీత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ మానవ వరుడు వారి సాక్షిగా వివాహముచేసుకొని మాతృత్వాన్ని ఇస్తాడు. ఆదేవతలే జన్మజన్మలకూ వారిమధ్యనే దాంపత్యాన్ని కలిగిఉండే అవకాశాన్ని ఇస్తారు. ఎన్నో జన్మల అనుబంధం అంటే ఇదే. ఋణాలు తీర్చుకునే అవకాశం ఇస్తారు. ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగిస్తారు, లేదా మోక్షమార్గం చూపిస్తారు. జాతకములు చూపించుకోవడంలో కూడా పరమార్థం అదే. ఏ దేవతలైతే గ్రహాలకు అధిదేవతలుగా ఉన్నారో వారే వివాహానికి సాక్షులౌతున్నారు. దీని వలన వివాహంలో అనుకూల్యత వచ్చే అవకాశం ఉన్నది. నేను హిందువుని అంటే నేను వేదాన్ని ప్రమాణముగా తీసుకుంటాను అనే అర్థం. నేను వేదాలలో చెప్పబడిన దేవతలను, వారిని గురించిన జ్ఞానాన్ని మనకు ఇచ్చిన ఋషులనూ నమ్ముతాను అనే అర్థం. వేదాలను నమ్ముతాను వేదాంతాన్ని నమ్మను, వేదాంగాలను నమ్మను అంటే అర్థంలేదు. దేవుడు సత్యం, అందరు దేవతలు అక్కర లేదు, జ్యోతిషం అసత్యం, మూఢ విశ్వాసం అనే హిందువునకు తన మతము తనకు తెలియదనే అర్థము.
మన వివాహ వ్యవస్థ – 5 ( హిందూ వివాహ వ్యవస్థ - ధర్మము - శాసనము (చట్టము))
వార్తా పత్రికలు చూస్తే అన్నీ స్త్రీలమీద జరుగుతున్న నేరాలే, అత్యాచారాలు, దాడులు, వేధింపులు, గర్భస్థ శిశు హత్యలు. గర్భస్థ శిశువు, చిన్న బాలిక, విద్యార్థిని, ఉద్యోగిని, గృహిణి, వృద్ధ వనిత అందరిపై ఈ ప్రభావం పడుతోంది. కొన్ని వార్తలుగా మిగిలిపోతాయి, కొన్ని కొంత ప్రచారాన్ని పొందుతాయి. ఆ బాధితులకు న్యాయం జరుగకపోయినా కొన్ని సంస్కరణలకు, నేరాలను అరికట్టగల చట్టాలకు దారితీస్తాయి. చట్టాలలో loopholes మరికొన్ని నేరాలకు దారితీయవచ్చు. పురుషులకంటె స్త్రీకి సమస్యలు ఎక్కువ (more vulnerable). ఇందులో చాలా ప్రత్యక్షంగాను, కొన్ని పరోక్షంగాను వివాహ, కుటుంబ వ్యవస్థకు సంబంధించినవే. Civil lawలో ఉన్నభేదాల వలన కేవలం హిందూవివాహమే ఇక్కడ ముఖ్యం. వివాహానికి ఒక Code of Conduct ఉంటుంది. మత పరంగా అది స్మృతి, నీతి, ధర్మ శాస్త్రాలపై ఆధారపడిఉంటుంది. ఇవి కొంతవరకైనా తెలుసుకోవటం ఈకాలంలో హిందువులకు అసాధ్యం, ఇతర మతస్థులకు సాధ్యం. ఇస్లాం వెబ్ సైట్ ఈ మాటను నిరూపిస్తుంది. క్రైస్తవులకైనా అంతే. మరి హిందువులు ఏమిచేయాలి? చాలా కుటుంబాలలో ఇంకా సదాచారములు, పద్ధతులు మిగిలి ఉన్నాయి. వాటిని అనుసరించడమే. భగవంతుని ఆరాధించడానికి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత వేదాంతాలన్నీ తెలుసుకోనక్కరలేదు. ఆరాధిస్తే ఫలం వస్తుంది. నీకు చేతనయినది చేసుకొ - పూజ, అర్చన, నామస్మరణ, ధ్యానం, కనీసం దీపారాధన చేయి. క్రమేణా వినడం వలన, పెద్దలను అడగడం వలన, చదవడం వలన విషయాలు అవే బోధపడతాయి.
గత శతాబ్దములో మనందరినీ skeptics నిత్యశంకితులుగా చేసినది మన ఆధునిక విద్య - ముఖ్యంగా సైన్స్. సాంప్రదాయాన్ని, విశ్వాసాలనీ చిన్న చూపుచూసేటట్లు చేసినది ఈ విద్యయే. "విద్య యొసగును వినయంబు" అనే సుభాషితం మరచిపోయి, ఒక అహంతను తయారుచేస్తున్నది. ఒక ఇంటర్ వ్యూ కు వెళ్ళినప్పుడు , ఒక సెమినార్ ఇచ్చినప్పుడు self confidence గా ఉన్నంతవరకు అది అవసరమే. విజిటింగ్ కార్డ్ మీద VVS Sarma, PhD, FNA, Distiguished Professor అని వేసుకొని ఎవరికైనా ఇస్తే ఆసమయానికి కొంత గుర్తింపు రావచ్చు. కాని ఇది ఇంటిలో భార్య వద్ద ఎందుకు పనికి వస్తుంది? "లేత వంకాయలు ఏరుకొని తీసుకురాలేరు, చెప్పిన వాటిలో సగం మరచిపోతారు. ఎవరు ఇచ్చారు మీకు డాక్టరేట్?" అని భార్య ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఒక దేవుడి విగ్రహమో, చిత్రపటమో, ఒక సద్గురువు చాయా చిత్రమో పెట్టుకుని చేసే పూజలకు ఫలముంటుందని ఎవరు చెప్పారు? సైంటిఫిక్ గా నిరూపించండి అని యే జన విజ్ఞాన వేదిక వాడో అడిగితే చాలామంది తగిన సమాధానం చెప్పలేరు. ఇంత విజ్ఞాన శాస్త్రపు అభివృద్ధి వలన ప్రపంచానికి లాభం కలిగినదా? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి, సైంటిస్టులది.
నా దృష్టిలో ప్రశ్నించడం కంటె ఆప్తవాక్యాన్ని, సాంప్రదాయాన్నీ విశ్వసించడం శ్రేయస్కరం.
పెళ్ళిళ్ళలో జాతకాలు చూడడం ఎందుకు? అవసరమా?
నిజానికి అంతకంటె అవసరం Proper Counselling. జాతకాల మీద ఉండే నమ్మకం, వ్యక్తుల విలువలపై ఉంటే జాతకాలు ముఖ్యం కాదు. జాతకం perfect match అని చెబితే కాపురం సజావుగా జరుగుతుందని గారంటీ లేదు. అసలు సమస్య జాతకం అంటే, జ్యోతిషం అంటే ఏమీ తెలియకపోవడం. జ్యోతిషం అంటే కాల నిర్ణయాన్ని, గ్రహ గతులను చెప్పే శాస్త్రం. పంచాంగమును గుణించడం, పెళ్ళికి ముహూర్త నిర్ణయం చేయడం దీని పరిధిలోకి వస్తుంది. దానిని బట్టి భవిష్యత్తుని చెప్పగలగడం ఒక కళ. ఉదాహరణకు శాస్త్రం విడాకులపై ఏమీచెప్పదు. ఎందుకంటే ఈ శాస్త్రాలు వ్రాసేటప్పటికి ఆ ప్రసక్తిలేదు. కాని శాస్త్రసూచనలను ఈకాలానికి అన్వయించిచెప్పగల జ్యోతిష్కులు కావాలి. వారు చెప్పినా సూచన మాత్రంగానే చెప్పగలరు. సూచన లభిస్తే, దానిని పరిగణన లోనికి తీసికొని తన విలువలు, భగవంతునిపై విశ్వాసము ద్వారా ఆపరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఈకాలములో ఇద్దరూ కూర్చుని అన్నివిషయాలు మాట్లాడుకోవడము మంచిది. వివాహం జీవితంలో ఒకేసారి అనే విలువ ఇద్దరికీ ఉంటే పరిస్థితి అంతవరకూ రాదు. అప్పుడు జాతకాలు పుచ్చుకొని పరుగెత్తడం అర్థ రహితం.