Saturday, September 28, 2013

ఆదికవి నన్నయ్య - 3

'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో మిత్రులు నన్నయ్య గారి గురించి అందించిన పద్యాలు, విషయాలు...

శ్రీ డి వి లీలాప్రసాద్ గారు 

నన్నయ్య - ఆంధ్ర కావ్య భాషాస్వరూపము

హరిహరాజ గజా ననార్క షడాస్య మాతృ సరస్వతీ
గిరి సుతాదిక దేవతా తతికిన్ నమస్కృతి సేసి దు
ర్భర తపోవిభవాధికున్ గురుపద్యవిద్యకు నాద్యు నం 
బురుహ గర్భ నిభున్ ప్రచేత సుపుత్త్రు భక్తి ( దలం చుచున్ --- నన్నయ్య.

*** నన్నయ్య గారు తన భారతము మొదట నిద్దరు కవులను మాత్రమే స్తుతించినారు. మొదటి
కవి వాల్మీకి, రెండవ కవి వ్యాసు( డు. మూడవ కవిని నెన్నుకొనలేదు.

*** పద్య విద్య: ఈ విద్య బహు విధములు. ఇందులో ప్రధానమైనది పద్యం. విద్య యనగా
" విద్య ఎంతమేర యుండునో యున్నంతమేర ప్రతిభ యనుస్యూతమై యుండును. ఈ విద్యకు
మొట్ట మొదటిది పద్యము. నన్నయ్య గారు తెలుగు లో పద్యము వ్రాయుటెట్లో, యెట్లు
వ్రాసినచో పద్యమగునో చేసి చూపించినాడు.

*** ఆంధ్ర భాష లో మొట్టమొదటి మహాకావ్య నిర్మాణము, మహా కార్యవగ్రుడైన, మహర్షి
కల్పుడైన నన్నయ్య గారు, యా నిర్ణయము చేసెను. ఉత్పలమాల, చంపకమాల,
శార్దూల మతేభములు, కంద, సీస, గీత పద్యము -- వీనిని సర్వాంధ్ర మహాకావ్య
ప్రధాన శరీరభూతమైన చందస్సులుగా నిర్ణయించెను. వాటికి కావ్యాకృతి నిచ్చెను. 
తరువాత కవులకు మార్గమిదియే. ఇది నన్నయ్య గారి గొప్పదనము.

*** ఆంధ్ర సాహిత్యములో మొట్ట మొదటే నన్నయ్య, సామాన్యములైన, ఉదాత్తములైన
భావములను విడమరచి కావ్యాభిలాషులకు నేర్పించి పెట్టిరి. వారు ఆంధ్ర కావ్యభాషా
స్వరూపమును నిర్ణయించెను.

*** నన్నయ్య తెలుగు లో ఏది వ్రాసినను కావ్య పద్దతిన, నాటక పద్దతిన వ్రాసినాడు.
అల్పాల్పముగా కొన్ని వందలయేండ్లు నడచిన తరువాత గానీ ఒనగూడని నొక భాషా
సారస్వతము, మహా కావ్య రూపమున నొక్కసారిగా తొట్ట తొలుత తానే సంతరిచి పెట్టిన
మహనుభావుడు నన్నయ్య -- ఆంధ్ర శారదకు కొన్ని వందలేండ్లు కలసి వచ్చినట్లు చేసినాడు.

*** సంస్కృత భాష యందు, కావ్యము నందు యెన్ని సౌదర్యములు నెన్ని రామణీ యకములు,
శాబ్దీకములైనవి, యార్దీకములైనవి చేయుటకు వీలున్నదో, వాని నన్నింటిని
తెలుగు కావ్యమునందు చేయుటకు వీలైన భాషనూ -- నన్నయ్య గారు నిర్ణయించిరి.

**** ఇది నన్నయ్య గారు మనకు, మన భాషకు చేసినట్టి మహోపకారము.
**** పద్య విద్య యనగా, నన్నయ్య గారు దీనిని సర్వము యని భావించిరి.
**** అంబురుహగర్భుడాయన యొక్కడే ! విద్యాదయితుడు !!

**** ఇది నన్నయ్య గారి మీద, శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ గారి సహేతుక అభిప్రాయము.

                                                         



కొల్లూరు విజయ శర్మ 20.9.13 

ఋషి వంటి నన్నయ్య "అన్నారు మహాకవి విశ్వనాధ. ఇక ఆయన కవిత్వమా...తేనె వాగు... కృష్ణశాస్త్రి గారు చెప్తారు.. "స్వర్గమా!మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసికెళ్ళనా"అంటార్ట తిక్కన గారు.. స్వర్గమా... భూమి మీదికే అవతరింప చేస్తాను అంటారట నన్నయ గారు. అన్నట్లే అవతరింప చేశారూ.ంమనల్ని తరింప చేశారు కూడా . 

"శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షావుముఖామ్జేషుయే 
లోకానాం స్థితి మావహన్త్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవామ్ 
తేవేదత్రయమూర్తాయ స్త్రిపురుషా స్సంపూజితావస్సురై 
ర్భూయాసుఃం పురుశోత్తమామ్బుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే "
ఇది నన్నయ మహాభారత మంగళా చరణ శ్లోకం.
లక్ష్మీ దేవిని హృదయంసరస్వతి ని ముఖం లో ,పార్వతిని శరీర సగభాగం లో విష్ణు ,బ్రహ్మ,పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు చిరకాలము ఉందు గాక... అని భావం.
ఇక్కడే ఉంది నన్నయ గారి రుషిత్వం.లోకంలో మన బోటి వారు మాట్లాడే మాటల్లో అర్ధాన్ని శబ్దం వెతుక్కుని వస్తుంది. అంటే ఏం చెప్పదలిచామో ఆ భావానికి తగిన పదాలను ఏరుకుంటాం .కానీ తపశ్శక్తి సంపన్నులయిన మహర్షులకి అర్ధమే వాక్కుని వెతుక్కుంటూ వెళ్తుందట. అంటే వారు ఏది అంటే అదే జరుగుతుంది. వారు మంచి పలికారా అది వరం. చెడు తలిచారా అదే శాపం. ఒక్కసారి పై శ్లోకం చూశారు కదా.. నన్నయ్య గారు త్రిమూర్తులని స్మరించారు. కానీ వరుస మారింది. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం ఆయన చూడండి. ముందుగా విష్ణువు,తర్వాత బ్రహ్మ ,ఆ తర్వాత శివుడు ఇలా స్మరించారు.
నిజానికి నన్నయ్య గారు మహాభారత రచన కి శ్రీకారం చుట్టే వేళ అది తన ఒక్కరి తో పూర్తి కాదు అని కలలో కూడా ఊహించలేదు. ,వ్యాకరణ రాసి.. లో కల్పించి ఆయన భారత రచన కి పూనుకున్నారు. విష్ణువు స్థితికారకుడు నన్నయగారు కూడా ఆ ఆ స్థితినే తెలుగు భాషకి ఇచ్చారు. ఆయనకీ ప్రజలు వాగనుశాసనుడు ,శబ్దానుశాసనుడు ఇచ్చారు. విష్ణువుతర్వాత బ్రహ్మ గారు.. నన్నయ్యగారి తర్వాత 200 ఏళ్ళ తర్వాత వచ్చారు. అలవోకగా పదిహేను పర్వాలను తెలుగు చేసిన ఆయన వాక్కులో సరస్వతి తాండవిస్తుంది అనడం లో సందేహమే లేదు. మరి ప్రజలు ఆయనకీ ఇచ్చిన బిరుదు?"కవి బ్రహ్మ "... ఆ తర్వాత మరో శతాబ్దానికి వచ్చిన ఎఱ్ఱన గారు.. నన్నయ గారు రాయగా ఖిలమైపోయిన అరణ్య పర్వం సగభాగాన్ని రాశారు .ప్రజలు ఆయనకీ ఇచ్చిన బిరుదు "ప్రబంధ పరమేశ్వరుడు"నన్నయ్య గారు శ్లోకం రాసేటప్పుడు కలలో కూడా అనుకుని ఉండరు. కానీ ఆయన వాక్శుద్ధి ఇలా జరిపించింది. Vijaya

నన్నయ మహాకవి పద్యాలలో అత్యద్భుతమైన,పరమ హృద్యమైన పద్యాలలో ఇది ఒకటి. 
విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాధ! పుత్ర గా 
త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం 
ద్రపరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ బుత్రగా 
త్ర పరిష్వంగ మునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే !
శకుంతల ఎవరో తనకు తెలియదన్న దుష్యంతునితో శకుంతల ఈ మాట అంటుంది "ఇన్ని వాద ప్రతివాదాలు ఎందుకు మహారాజా!ఒక్క సారి నీ కుమారుణ్ని కౌగిలించుకో . ముత్యాల కానీ ,కర్పూరపు పరిమళం కానీ ,పూల పుప్పొడి కానీ ,గంధం కానీ చివరికి వెన్నెలకానీ కుమారుడిని కౌగిలించుకున్నప్పుడు కలిగే చల్లదనానికి ,పులకరింతకీ సాటిరావు.. అంతకంటే ఇవేమీ హృఊద్యమైనవి కావు "అని. 

మనలో చాలా మందికి ,ఈ భావన అబుభవేకవేద్యమే అనుకుంటాను.

 రావినూతల శ్రీనివాస్ గారు 

హరివిచిత్రహేమ కవచావృతు డున్నతచాపచారు దీ
ర్ఘోరుభుజుండు, భాస్వదసితోత్పల వర్ణుడు, సెంద్రచాప శం
సారుచి మేఘమో యనగ బాండవ మధ్యముడొప్పి బద్ధ తూ
ణీరుడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్నె చూడగన్. 6-17

అందమైన విచిత్రమైన బంగారపు కవచం ధరించాడు. ఆజానుబాహుడు. ఒక చేతిలో ఉన్నతమైన ధనస్సు ఉంది. మనిషి నల్లకలువల రంగులో తలతళలాడుతున్నాడు. పైరెండింటితో (విచిత్రహేమ కవచం, ఉన్నత చాపం) కలిసిన మొత్తం రూపం – హరివిల్లుతో, మెరపుతీగతో కలిసి ఉన్న నీలమేఘంలా ఉంది. వీపు మీద అటూ ఇటూ అంబులపొదులున్నాయి. పాండవ మధ్యముడైన అర్జునుడు ఇలా వచ్చి రంగమధ్యమంలో నిలబడితే ప్రజల చూపులన్నీ అతడి మీదే నిలబడ్డాయి.

అర్జునుడి రూపంలో ఉన్న ఉదాత్తతనీ, వీరోచిత దర్పాన్నీ, ఉన్నతినీ ఈ పద్యం సూచిస్తోంది. సమాస నిర్మాణంలో ప్రయోజనం నెరవేరింది. నడకలో ఠీవి స్ఫురిస్తోంది. వేటిని స్పురింప చెయ్యాలన్నా కవి చేతిలో ఉన్న సాధనాలు శబ్దార్థాలు మాత్రమే కదా! వాటిని సద్వినియోగం చేసుకొని వాచ్యార్థం కన్నా లోతైన అంశాలు స్పురింపజేయగలిగిన వాడే మహాకవి.

అర్జునుడు నల్లగా ఉంటాడని ఈ పద్యంలో తెలుస్తోంది. “కఱ్ఱి విక్రమంబు కాల్పనే” అని ద్రౌపది ఉద్యోగపర్వంలో అంటుంది. కఱ్ఱి అంటే నల్లనివాడు అని అర్ధం. ద్రౌపది కూడా నలుపే. ‘కృష్ణ ‘ అని ఆవిడకి పర్యాయపదం. శ్రీకృష్ణుడు సరేసరి నీలమేఘశ్యాముడు. ఇలా పాండవ పక్షంలో ముఖ్యులు ముగ్గురు నల్లనివారు.

ఇంద్రధనుస్సుతో మెరుపుతీగతో కలిసిఉన్న మేఘంలా ఉన్నాడు అర్జునుడు. వర్షఋతువులో కనపడవచ్చు ఇటువంటి దృశ్యం. ఇక్కడ మరొక విశేషం ఉంది. ఇంద్రచాపంతో కలిసిఉన్న మేఘంగా ఉత్ప్రేక్షించడం వల్ల అర్జునుడు ఇంద్రుని కుమారుడు అనే విషయం కూడా స్ఫురణకు వస్తుంది.

ఈ పద్యం నన్నయ భారతం లోది,అంతర్జాలం నుండి సేకరించినది.


20. 9. 13 

 నన్నయభట్టారకుడు ఆంధ్ర మహా భారతాన్ని ఈ దిగువ సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు. ఇది త్రిమూర్తులను స్తుతిస్తూ చేసిన మంగళస్వరం. 
శ్రీవాణి గిరిజాశ్చిరాయదధతో వక్షోముఖాం గేషుయే 
లోకానాం స్థితి మావహన్త్య విహతాం స్త్రీ పుంస యోగోద్భవాం 
తే వేదత్రయ మూర్తయే స్త్రీ పురుష సంపూజితా వస్సురై 
ర్భుయాసుః పురుషోత్తమాంబుజ భవశ్రీకంధరాశ్రేయసే!

సరస్వతి, పార్వతి, లక్ష్మి లను ఎవరు అనాదిగా ముఖమునందు, దేహమందు , హృదయమందు ధరించి సృష్టి, స్థితి, లయ కార్యములను, లోకములను నిర్వహిస్తున్నారో, మూడు వేదాలను ఆకారముగా ధరించినవారు, దేవతలచే పూజింపబడువారు ఐన బ్రహ్మ,శివుడు, విష్ణువు అను ముగ్గురు దేవతలు మీకు శ్రేయస్సును కల్గింతురుగాక.



శ్రీదేవి సిరి కావుటూరు 

ఆదికవి నన్నయ వ్యాసభారతాన్ని కీర్తిస్తూ చెప్పిన సందర్భంలోని పద్యం...

ధర్మతత్త్వఙ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని కవివృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహమని, యైతిహాసికు లితిహాసమనియుఁ
బరమపౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహికొనియాడుచుండ

వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు డాదిముని పరాశరాత్మజుండు
విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండఁ జేసె భారతంబు.

భావం: ధర్మతత్త్వఙ్ఞులు ధర్మశాస్త్రగ్రంధమనిన్నీ, వేదాంతులు వేదాంత శాస్త్రమనిన్నీ, నీతివిచక్షణులు నీతిశాస్త్రమనిన్నీ, కవిశ్రేష్ఠులు గొప్పకావ్యమనిన్నీ, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమనిన్నీ, భూమియందు పొగడుతూ ఉండగా, సర్వవేదాల సత్యస్వరూపాన్ని యెరిగినవాడున్నూ, వేదాలను విభజించి వేదవ్యాసుడని పేరుపొందిన వాడున్నూ, ఆదిమునియున్నూ, విష్ణువుతో సమానుడున్నూ అయిన పరాశరముని కుమారుడు ( కృష్ణద్వైపాయనుడు ) సర్వజనులకు హితమై ఒప్పేటట్లుగా సంస్కృతంలో భారతమనే గ్రంధాన్ని రచించాడు.


భారతి కాట్రగడ్డ 

మహొజ్జ్వల చరిత్ర కలిగిన తెలుగు సాహిత్య ప్రపంచంలో మొట్టమొదటి తెలుగు గ్రంధం మహాభారతం. దీన్ని ఆంధ్రీకరించిన నన్నయ ఆదికవి. క్రీ.శ. 1022-1063 మధ్యకాలంలో రాజమహేంధ్రవరం రాజధానిగా పాలించిన చాళూక్య మహారాజు రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ మహాభారత రచన ప్రారంభించాడు. 'తింటే గారెలు తినాలి,వింటే భారతం వినాలీ అన్నంత సర్వాంత సుందరంగా కవిత్రయం ఈ గ్రంధాన్ని తీర్చిదిద్దారు. ఐతే నన్నయ ఈ గ్రంధం అన్నిరంగాలవారికి అన్నిరకాలుగా కనిపిస్తుందని ఈ పద్యరత్నం ద్వారా తెలియజేసారు.

ధర్మశాస్త్రఙ్ఞులు ధర్మశాస్త్రం బని
యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రంబని
కవివృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికు లితిహాస మనియు
పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ
యం బని మహి కొనియాడుచుండ

తే. వివిధ వేదతత్త్వవేది వేదవ్యాసు
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండ జేసె భారతంబు .         ---  నన్నయ.


ఆదికవి నన్నయ్య -2

'అచ్చంగా తెలుగు' పేస్ బుక్ బృందంలో వివిధ మిత్రులు అందించిన నన్నయ్య గారి విశేషాలు, పద్యాలు...

పరవస్తు నాగసాయి సూరి 

తెలుగు వారి మనసుల్లో చోటు సంపాదించుకున్న ఆదికవి నన్నయ. ఆయన కంటే ముందు ఎందరో కవులు ఉంటే ఉండవచ్చు గాక.... అద్భుతమైన కావ్యాలు రాస్తే రాయవచ్చు గాక.... కానీ పంచమ వేదాన్ని మొదలు పెట్టగల సాహసం చేసిన నన్నయను ఆదికవి అనకుండా ఎలా ఉండగలం. వందేళ్ళ సినిమా గురించి చెప్పేటప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే గురించి చెబుతాం. ఆయన కంటే ముందు సినిమా కోసం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు. కానీ తొలి విజయం ఇక్కడ సాధ్యమైంది. ప్రారంభం ఘనంగా ఉండాలని ప్రతి వారూ భావిస్తారు. అందుకే.... నన్నయను ఆదికవిగా తెలుగు సాహిత్య పుటల్లో నిలిపారు. 

సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణమైతే తెలుగులో తొలి ఇతిహాసం భారతం. నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతమే తెలుగులో తొలి ఇతిహాసం. నన్నయకి ‘ఆదికవి’ అనే బిరుదు అనంతరకాలంలో వచ్చిందే. మారన ‘‘ఆంధ్ర కవితా గురుడు’’ అన్నాడు. తిక్కన ‘‘ఆంధ్ర కవిత్వ విశారదుడు’’ అనీ, రామరాజ భూషణుడు ‘వాగశాసనుడు’ అనీ మాత్రమే నన్నయను స్తుతించారు. ( ద్వానాశాస్త్రిగారి ఓ ఆర్టికల్ నుంచి )

మహానుభావులకు భవిష్యత్ ఏం జరగనుందో తెలుస్తుందట. ఆ విషయంలోనూ నన్నయను ఆదికవిగా ఒప్పుకోవచ్చు. భారతాంధ్రీకరణను ప్రారంభిస్తూ....

శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాజ్ఞ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే

అంటూ సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభించారు. 
లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. వేద స్వరూపులు. దేవతాపూజ్యులు. పురుషోత్తములు. అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక. అని ఈ పద్యం అర్థం. 
ఇక్కడే నన్నయ భవిష్యత్ దర్శనం బోధపడుతుంది అని పండితులు చెబుతారు. ఎందుకంటే.... ఇక్కడ త్రిమూర్తుల గురించి నన్నయ చెప్పారు. అప్పట్లో ఇష్టదేవతను స్మరించుకునే వారే తప్పించి... ఇలాంటి వర్ణన ఓ విధంగా లేదనే చెప్పాలి. నన్నయ ఇలా చెప్పడంలో ఆంతర్యం.... మొత్తం ముగ్గురు ఈ కావ్యాన్ని పూర్తి చేస్తారు అని భవిష్యత్ ను దర్శించడమే అని అంటారు. 

లక్ష్మిదేవిని వక్షాన ధరించిన నారాయణుడి లాంటి నన్నయ... సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ... తిక్కనకు కవి బ్రహ్మ అనే బిరుదము ఉంది. అంటే బ్రహ్మ లాంటి తిక్కన... పార్వతిని తన అర్థభాగమున నిలిపిన పరమేశ్వరుడు... ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. అంటే శివుడి లాంటి ఎర్రన... మహాభారతమును పూర్తి చేసి మనకు శ్రేయస్సును కలిగిస్తారు అని నన్నయ చెప్పకనే చెప్పారు అని విబుధులు అంటారు. 

మహాభారతం అనేది ఓ కథ మాత్రమే అయితే మనకు శ్రేయస్సు ఎలా కలిగిస్తుంది. నన్నయ రాసిన పద్యాల్లోని ఓ రెండు మూడు ఉదాహరణలు చూద్దాం....

మనకు సభామర్యాద ముఖ్యం అని చెబుతారు....
అది ఎలా ఉండాలో... యయాతి రూపంలో నన్నయ తెలియజేశారు....

మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్

సభలో మనసుకు ప్రియంగా ఉండే హిత వాక్యాలే చెప్పాలి. చాలా మితంగా మాత్రమే మాట్లాడాలి. అదీ సరళంగా, ఎదుటివారు నొచ్చుకొనని రీతిగా మాట్లాడాలి.


సత్యమేవ జయతే అనేది మన భారతీయులు నమ్మే మూల సూత్రం....
దాని గురించి శకుంతల రూపంలో నన్నయ తెలియజేశారు....

నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటెనొక్క స
త్క్రతు వది మేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు, త
త్సుతు శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

నూరు నూతులకంటె ఒక బావి (దిగుడు మెట్లున్నది) మంచిది. నూరు బావులకంటె ఒక యజ్ఞము మంచిది. అటువంటి నూరు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు. నూరుగురు కొడుకులకంటె ఒక సత్యవాక్యము మేలు.

ఒక చోట భవిష్యత్ గురించి చెబుతూ నన్నయ మన వేదాంతాన్ని ఆవిష్కరించారు.

మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు, గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్.

సంసారం అతి చంచలమైనది. సంపదలు ఎండమావులవంటివి, క్షణికమైనవి. గతకాలమే వచ్చేకాలం కంటే మేలైనది. ఇది మనం తరచుగా వాడే సామెత కూడాను.

ఇలాంటి గొప్ప విషయాలను తెలిపే ఉపాఖ్యానాలు నన్నయ విరచిత భారతంలో ఎన్నో ఉన్నాయి. ఒక్క ఆదిపర్వంలోనే నలభై వరకూ ఉన్న ఈ ఉపాఖ్యానాలు సామాజిక విలువలను ప్రతిబింబిస్తాయి. ఈ విలువలే కదా మనిషికి శ్రేయస్సును కలుగజేసేది. అందుకే నన్నయను ఆదికవి అనడం సముచితంగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. 

ఇక చివరిగా... మహాభారతంలో ఆయన రాసిన చివరి పద్యంతో ముగిస్తాను....

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై

మెరిసే తారకహారాలపట్ల శారదరాత్రులు దొంగలుగామారాయి (తెల్లని వెన్నెలలో చుక్కలు బాగా కనపడవు). అప్పుడే వికసించిన తెల్లకలువల సౌరభాలను వంటబట్టించుకొన్న పిల్లగాలులు వీస్తున్నాయి. పూల పరాగంతో ఆకాశం వెలిగిపోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడివలె తెల్లని వెన్నెలను వెదజల్లుతున్నాడు.

--- పరవస్తు నాగసాయి సూరి


రావినూతల శ్రీనివాస్ గారు 


ఆది పర్వంలో పక్షి రూపంలో తొందరగా కైవల్యం పొందవచ్చని గ్రహించి మందపాలుడనే ముని పక్షి రూపు ధరించి జరిత అనే

లావుక పక్షిని పెళ్ళాడి ఆమెద్వార నలుగురు పిల్లలను పొందాడు. తరువాత తపస్సు చేయడానికి వెళ్ళాడు. కృష్ణార్జునుల సహాయంతో అగ్ని దేవుడు కాండవ వనాన్ని దహిస్తున్న సమయంలో, అన్ని వైపుల నుండి అగ్ని దహిస్తుంటే తన పిల్లలను కాపాడుకోవటానికి జరిత పడుతున్న బాదను, ఆమె మాతృహృదయాన్ని నన్నయ వర్ణించిన తీరు అద్భుతం. అందులోని కొన్ని పద్యాలు
చంపకమాల:
ఇది ప్రళయాగ్నివోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫులింగముల్:
వదలక వాయుసారథి జవంబున దా నిట వచ్చె నేమిసే:
యుదు సుతులార యీబిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ:
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండగన్:.
అర్థము: ఓ పుత్రులార| ఈ కార్చిచ్చు అన్ని దిక్కుల నుండి క్రమ్ముకు వస్తుంది, ప్రళయ కాలంలో చెలరేగే విధంగా వాయువునే సారధిగా కలిగిన ఆ అగ్నిదేవుడు మనను కబళించడానికి వస్తున్నాడు. ఈ అగ్ని బారినుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ బిలము నందు దూరండి, నేను దానిని దట్టమైన ధూళి సమూహముచేత కప్పివేస్తాను.
తేటగీతి
బిలము సొచ్చితిమేని నందెలుక చంపు:
నింద యుండితిమేనిఁ దా నేర్చు నగ్ని:
యెలుకచే జచ్చుకంటె నీ జ్వలనశిఖలఁ:
గ్రాగి పుణ్యలోకంబులఁ గాంతు మేము:.
అర్థము: బిలములో దూరితే అందుగల ఎలుక చేతిలో చచ్చెదము, ఇక్కడే వుంటె అగ్నిలో మాడిపోయెదము. ఎలుక చేతిలో చచ్చే కన్న అగ్నిలో ఆహుతి కావడం వలన పుణ్యలోకాలనైన పొందెదము.
కందము
జ్వలనంబు వాయువశమునఁ:
జీవనము మాకు దొరకొను గృఛ్రం:
బుల సంశయయుతకార్యం:
బులు గర్తవ్యములు నియతములు వర్జ్యమ్ముల్:.
అర్థము: వాయువు ఎటు వీస్తె అగ్ని అటువైపు వెళ్లును, అదృష్టవశాత్తు గాలి అనుకూలంగో వీస్తే ప్రాణాపాయమునుండి తప్పించుకొన వచ్చును, కాని బిలములోని ఎలుక బారి నుండి తప్పించుకొనుట కష్టము, అందు వలన చెట్టుపైనుండ శ్రేయస్కరము.

యీ విషయము అంతర్జాలము నుండి సేకరించినది.



ఆదికవి నన్నయ్య -1

  
తెలుగు కవిత్వం 9 వ శతాబ్దం నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది. నన్నయ్య గారికి పూర్వం మల్లియరేచన, పంపన , నాగవర్మ వంటి కవులు ఉండేవారని, లభ్యమైన పద్యాల ద్వారా తెలుస్తోంది. అక్కడా, ఇక్కడా వీరి పద్యాలే తప్ప కావ్యాలు లభ్యం కాలేదు. తెలుగు భాషలోని ఎరువు పదాలను తొలగించేందుకు, శబ్దాలకు ఒక వ్యవస్థను ఏర్పరిచి, ఒక స్థిరమైన రూపం ఏర్పరచి, 'శబ్దశాసన ' బిరుదు పొందారు నన్నయ్య .నన్నయ్య కేవలం అనువాద కవి అని, బసవపురాణం వ్రాసిన పాల్కురికి సోమనాధుడే ఆదికవి అన్న వాదనలు కూడా లేకపోలేదు. అయితే నన్నయ్య భారతంలో స్వేచ్చానువాద పద్ధతిలో తెలుగు నుడికారాలు, సామెతలు, పలుకుబళ్ళు, ఉపమానాలు ఉపయోగించారు.తెలుగుదనపు మర్యాదలన్నీ భారతానికి తెచ్చారు. అందుకే విమర్శకులు, భాషాపరిశోధకులు నన్నయ్య గారికే ఆదికవిగా ఆమోదించారు. 

ఆదికవి నన్నయ్య

నన్నయ్య కు పుట్టుక, తల్లి తండ్రులు ఇంటిపేరు ఎక్కడా ప్రస్తావించలేదు.. కానీ ఇంటిపేరు వాడ్రేవు వారని చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ద్వారా తెలిసింది..నన్నయ్యను నన్నయ బట్టు అని కూడా అంటారు. రాజరాజ నరేంద్రుడు రాజ మహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో నన్నయ అతని ఆస్థాన కవిగా ఉండేవాడు. నన్నయ్యకు ఆదికవి, వాగమ శాసనుడు అనే బిరుదులున్నాయి.

 చంద్రవంశంలో జన్మించిన రాజరాజనరేంద్రుడు అనే రాజు వద్ద 'విద్యా విలాస గోష్ఠి'లో అపార శబ్దశాస్త్ర పారంగతులైన పౌరాణికులు, మహాకవులు, తార్కికులు ఉండేవారు. వాళ్ళలో లోకజ్ఞుడు, శబ్దశాసనుడూ, ఉభయకావ్య రచనా శోభితుడూ అయిన నన్నయగారిని చూసి 'మా చంద్ర వంశంలో ప్రసిద్ధులైన పాండవోత్తముల చరిత్రను వినాలనుకొంటూ ఉంటాను. బంగారు కొమ్ములున్న నూరు గోవులను ఉత్తమ బహువేద విప్రులకు దానం చేసిన ఫలం భారతం వింటే వస్తుంది, అంటారు. నా మనసు ఎప్పుడూ భారత కధా శ్రవణానికై  ఉవ్విళ్ళూరు తుంటుంది.కృష్ణద్వైపాయన మునిశ్రేష్ఠ విరచిత మహాభారతంలోని నిగూఢ అంతరార్ధం అందరికీ తెలిసేట్టు మీ తెలివితేటలు, ప్రతిభ చూపించి తెలుగులో రచించండి 'అన్నారు.  అందుకు నన్నయ 'అడుగు పెట్టడానికి వీలులేని నిగూడార్ధ జలాలున్న భారత భారతీ సముద్రాన్ని బుద్ధిబాహువుల బలంతో ఈదడం బ్రహ్మదేవుడికైనా చేతనౌతుందా? అయినా విద్వజ్ఞుల అనుగ్రహంతో నాకు తెలిసినట్టు రాస్తాను. ' అంటూ...

"అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేదశా
స్త్రముల యశేషసారము  మదంబున బొందను బుద్ది బాహువి
క్రమమున దుర్గామార్ధజల గౌరవ భారత భారతీ సము
ద్రము దరియగ నీ(దను విదాత్రు కైనను నేర బోలునే..."
అన్నాడు. అంటే "ఆకాశంలో కనిపించే నక్షత్రాలను లెక్క కట్టడం సర్వ వేద శాస్త్రాల అశేష సారాన్ని  సంతోషంతో పొందడం, అడుగు పెట్టడానికి వేలులేని నిగూడార్ధ జాలం ఉన్న ఈ మహాభారతీయ సముద్రాన్ని బుద్ది అనే బలంతో ఈదడం సృష్టికర్త అయిన బ్రమ్హకైనా  చేతనవుతుందా ? అని అర్థం.  



ఆ రోజుల్లో 'దేవభాషే' గాని 'దేశభాష ' పనికిరాదని హేళన చేసేవారు. ఆ రోజుల్లో విద్యాపరిషత్తులు ఉండేవి. వీటినే "సత్సభలు" అనేవారు. రాజే తలచుకున్నాడు కనుక విద్యా పరిషత్తుల ఆమోదం పెద్ద సమస్య కాలేదు. కావ్యారంభంలోనే ఆయన ఈ సభలకు నమస్కారం చేసారు. అవ్యవస్థితమైన తెలుగు శబ్దములకొక వ్యవస్థను ఏర్పరచి రూపస్థైర్యమునొసగాడు నన్నయ. 'ఆదికవి' చాలా విషయాలకు ఆద్యుడు. ప్రతి కావ్యంలోనూ, మొట్టమొదట చదివే ఇష్టదేవతా ప్రార్ధన, పూర్వకవి స్తుతి, కుకవినింద, గ్రంధకర్త స్వవిషయం, కృతిపతి వర్ణన, శాశ్త్యన్తాలు మొదలయినవి, నన్నయే మొదలుపెట్టాడు. అంటే కాక గురు పద్యవిద్యకు ఆద్యుడయిన వాల్మీకిని, వ్యాసుడిని, సత్సభలనూ కొనియాడారు.

'ఆదికవి' స్థానం నన్నయది కాదని నిరూపించేందుకు చాలా మంది కంకణం కట్టుకున్నారు. నన్నయ కేవలం అనువాదకుడు మాత్రమెనని, కవి కాదని, కొంత మంది అభిప్రాయం. రాజరాజు నన్నయను, భారతంలోని అంతరార్ధం తెలియచెప్పేలా రాయమన్నాడు కాని, అనువదించమనలేదు. అందుకే పాత్రల పరిచయాలప్పుడు వారి స్వభావ వర్ణన, అందుకు తగిన విశేషణాల ప్రయోగం, తెలుగుదనాన్ని చూపించే గౌరవసూచాకాలు వాడడం, ఎత్తి పొడుపులు, నూతన కల్పనలు, యతి-ప్రాస యతుల ప్రయోగం, శబ్దాలంకార అక్షర రమ్యత, మాటల్లో ఔచిత్యం, అన్ని కలిపి, సర్వాంగ సుందరంగా ఆంద్రభారత కావ్యకన్యను మలచారు నన్నయ్య . 'ఉపదేశం చెయ్యనిది కావ్యం కాదని' భావించిన నన్నయ, ప్రత్యేకించి సందర్భోచితంగా కధలో కలిసిపోఎట్టు, సుభాషితాలు చెప్పడంలో నేర్పును చూపించారు. ఆ సూక్తులను, మనం ఇవాళ కూడా విరివిగా వాడుతుంటాం. 'గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...., సిద్ధుల చరితంబులు అల్పులకు నేరుగ శక్యమే..., వృద్ధుల బుద్ధులు సంచలింపవే...' వంటివి కొన్ని ఉదాహరణలు. ఇలా, ఆంద్ర భాషకు కావ్యము, వ్యాకరణము రెండింటిని ప్రసాదించిన నన్నయ్య, భారతంలోని మొదటి రెండున్నర పర్వాలనూ ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణమునూ, మనకు అందించాడు.


                                              

శ్రీ Vvs Sarma గారు...

పద్మినీ
నీవు ఆదికవి నన్నయ్య భారతమునకు సముచిత స్థానం కలిగించే ప్రయత్నం చేస్తున్నావు. అభినందనలు. ఏదైనా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం 6 నెలలక్రితం వ్రాసిన నన్నయ భారత ఆంధ్రీకరణానికి సంబంధించిన విషయాలను, ముఖ్యంగా ఆకాలపు చారిత్రక నేపధ్యాన్ని తిరిగి ఇక్కడ ఇస్తున్నాను.ఇది ఉపయోగకరం కావచ్చు. నేటి నేపధ్యంలో పరిశీలించవచ్చు. 
1
రాజరాజ నరేంద్రుడు - నన్నయ - ఆంధ్రమహాభారతము 
మన చరిత్ర పుస్తకాలలో లో రాజరాజ నరేంద్రుని పేరు కనిపించదు. ఉత్తరభారతంలో ఘజనీ మహమ్మదు 17 పర్యాయములు దండెత్తి ముఖ్యదేవాలయాలు విధ్వంసం చేసే సమయంలో దక్షిణభారతంలో సనాతన ధర్మ ప్రతిష్ఠాపన జరుగుతూంది. ఆది శంకరుల అడుగుజాడలలో, దేశభాషలకు ప్రచారమిచ్చిన బౌద్ధ జైనాలకు దీటుగా, సనాతన ధర్మ గ్రంధాలను దేశభాషలలోనికి తీసుకొని రావలసిన అవసరం వచ్చింది.వేంగి దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు, రాజరాజ నరేంద్రునిచేత (సా.శ.1019–1061) ఆ కార్యక్రమం ప్రారంభింపబడినది. రాజమండ్రి అనే రాజమహేంద్రవరాన్ని స్థాపించి, పాలించినవాడాయన. తన మంత్రి, గురువు ఐన నన్నయ భట్టారకుని పిలిచి లక్ష శ్లోకాల సంస్కృతభారతమును తెనిగించమని కోరాడు. నన్నయ జన్మస్థలం తణుకు అని చెబుతారు. ఆయన భారతాంధ్రీకరణం మొదలుపెట్టి తన జీవిత కాలంలో ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని అనువదింఛాడు. 
1. కావ్యారంభం
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే
లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. అవిహితమైన స్త్రీ, పురుష యోగోద్భవమైన లోకముల స్థితి వారు కలిగించుచున్నారు. వేదస్వరూపులు, దేవతాపూజ్యులు, పురుషోత్తములు, అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక. -- మహాభారతాంధ్రీకరణలో మొదటిగా నన్నయ చెప్పిన సంస్కృత శ్లోకం ఇది. తెలుగు సాహిత్యానికి శ్రీకారం.
2. మహా భారత ప్రాశస్త్యం 
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని | యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని | కవివృషభుల్ మహాకావ్యమనియు 
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని | యైతిహాసికులితిహాసమనియు 
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ| యంబని మహా గొనియాడుచుండ 
వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు | డాదిముని పరాశరాత్మజుండు 
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై | పరగుచుండ జేసె భారతంబు 
3. సభలో ఎలా మాట్లాడాలి? 
మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్
తెలుగు మహాభారతం ఆంధ్రదేశమంతా బహుళ ప్రచారం పొందినది. "వింటే భారతం వినాలి" అనిపించింది. నేటి వరకు దీనిని మించినదిలేదు. గత వేయి సంవత్సరాలలో అభివృద్ధిచెందిన తెలుగు భాషకు, దానికి కారణమైన ఆంధ్రమహాభారత గ్రంధానికీ నిరాదరణ వస్తుందా? అనే అనుమానం 21వ శతాబ్దపు భారతదేశ లక్షణం. ఇప్పుడు 25-45 సం. వయస్సులోనివారు ఎందరికి కవిత్రయం భారతంతో పరిచయంఉంది? ఈ ప్రశ్నకు సమాధానం, నన్నయగారి శిలా ప్రతిమ కంటే ముఖ్యం. 5000 ఏళ్ళనాటి మహాభారతగాధను తెలుగు భారతం సామాన్యులకు అందించింది. దేశమంతా రామాయణము ప్రసిద్ధము,లోకప్రియము. కేవలము ఆంధ్రులకు భారతం అత్యంత ప్రియమైన గ్రంధం. 21వ శతాబ్దంలో భారతాన్ని చదువుకుంటే, శ్రీకృష్ణుని పూజిస్తే, భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని రక్షించుకోగలము. మహాభారతానికి, భారతదేశానికి మధ్య ఉన్నది అవినాభావ సంబంధం. 
2
తెలుగు సాహిత్య చరిత్ర చెప్పుకుంటూ తూర్పు చాళుక్య రాజు, రాజరాజ నరేంద్రుణ్ణీ, ఆదికవి, వాగనుశాసనుడు నన్నయ్యని, రాజమండ్రీని , తణుకునీ తలచుకున్నాం. సమయం సా.శ. 1050 ప్రాంతం. ఎవరీ తూర్పు చాళుక్యులు? ఎక్కడనుండి వచ్చారు? తెలుగు చరిత్ర, సాహిత్యం గురించి మాట్లాడుకుంటే కటకం, పర్లాకిమిడి, రాజమండ్రి, వేములవాడ, వరంగల్లు, నెల్లూరు, చెన్నపట్టణం, కంచి, తంజావూరు, మధుర, హంపీ విజయనగరం, శృంగేరి, కోలారు, బళ్ళారి, ఎలహంక (బెంగుళూరు), బాదామి (వాతాపి), ఢిల్లీ, (హరప్పా, లాహోరు తో సహా) గుర్తుకు తెచ్చుకోవాలి. రాజకీయంగా రాజమండ్రీకి పూర్వరంగం కర్ణాటక లోని బాగలకోట జిల్లాలోని బాదామి (వాతాపి). చాళుక్యుల ముఖ్య ప్రదేశం. వాళ్ళే పశ్చిమ చాళుక్యులు. వాళ్ళే బాదామినుండి రాజమండ్రీ వరకు ఆరవ శతాబ్దమునుండి, పదకొండవ శతాబ్దము వరకు ఇప్పటి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలుగా చెప్పబడే ప్రాంతాన్ని పాలించారు. కన్నడభాషని సాహిత్యాన్ని పోషించారు. కన్నడ కవులు పంప, తరువాత రన్న, పొన్న అనేవారు హళెగన్నడ (పాత కన్నడం) అనే అప్పటి భాషలో కన్నడ సాహిత్యానికి ఆద్యులు. వీరు కన్నడ భాషకు కవిరత్నత్రయం. ఆదికవి పంప కన్నడభాషలో పంప భారతాన్ని వ్రాశాడు. దాని మరోపేరు విక్రమార్జున విజయం. ఈ పంప వేములవాడ నుండి వెళ్ళాడు. పొన్న వేంగీ దేశపు (ఏలూరు ప్రాంతం) వాడు. ఈయన భారతం పేరు గదాయుద్ధ (భారతయుద్ధం ఆఖరి ఘట్టం -భీమ దుర్యోధన యుద్ధం). నన్నయ పేరు నారాయణ శబ్దానికి తెలుగు వికృతి. ఈయన తన మిత్రుడైన నారాయణభట్టు సహాయంతో భారత రచన చేశాడు. నారాయణ భట్టుకు ఈ కన్నడ సాహిత్యంతో పరిచయం ఉన్నది. కాని కన్నడ భారతాలు వ్యాస భారతం అనువాదాలు కాదు. ఆ కవులకు కూడా జైనమతంపై ఉన్న అనురక్తి సనాతనధర్మం పైలేదు. వాళ్ళ ముఖ్యగ్రంధాలు జైన పురాణాలు. వీరరస ప్రధానగ్రంధాలుగా వాళ్ళు భారత కథను వ్రాశారు. పైగా ఒకరు అర్జునుని నాయకుడుగా వ్రాస్తే, ఒకరు భీముణ్ణి నాయకునిచేశారు. వాళ్ళవాళ్ళ ప్రభువులను ఆయా నాయకులతోపోల్చారు. ఈ పంప చాళుక్యరాజు అరికేసరి ఆస్థానకవి. రాజును అర్జునునితో పోల్చినప్పుడు ద్రౌపదికి ఐదుగురు భర్తలంటే ఏంబాగుంటుంది? అందుకు ద్రౌపదిని అర్జునునికి ఒక్కడికే భార్యను చేశాడు. యుద్ధం తరువాత అర్జునునికే పట్టంకడతారు. పైగా సుభద్ర మహారాణి. జైన పురాణాలు, ఈ మార్చిన భారతకథలూ ఆంధ్ర దేశంలోకూడా ఈ కవి పండితులద్వారా ప్రచారమయ్యాయి. వీరంతా అన్ని రాజ్యాల రాజుల వద్దకూ వెళ్ళేవారు. రాజమండ్రీనుండి కటకంపై వరకు కళింగ సామ్రాజ్యం. ఈ రాజకుటుంబాలన్నీ వివాహ సంబంధాలు కలిగిఉండేవి. రాజ రాజనరేంద్రుని కాలానికి, గోరక్షనాథ ప్రభావం వలన జైనం స్థానంలో స్మార్త శైవం వచ్చినది. సారంగధర కథ మాళవదేశమునుంచి వచ్చినది. చరిత్ర గతిలో వ్యాస మహాభారతాన్ని యధాతథంగా తెలుగు ప్రజలవద్దకు తీసుకు రావలసిన అవసరం వచ్చినది. తెలుగు సాహిత్యపు శుభారంభానికి రాజమండ్రి కేంద్రమయింది. కాని రాజ రాజ నరేంద్రుని అనంతరం అనతికాలం లోనే సామ్రాజ్యకేంద్రం తంజావూరుకు, భాషా చరిత్ర కేంద్రాలు వరంగల్లుకు, వెలనాడుకు, నెల్లూరుకు తరలిపోయాయి.


భారతావతరణము -1 
నన్నయను స్మరించుకుంటే విశ్వనాథవారి రేడియో రూపకం భారతావతరణము గుర్తుకు వస్తుంది. ఇది 1961 సెప్టెంబరు 24న ఆకాశవాణి హైదరాబాదు వారు ప్రసారంచేశారు. తరువాత భారతిలో ఫిబ్రవరి 1962లో ముద్రింపబడినది. 
మొదటి రంగం - స్థలం - రాజమహేంద్రవరం. గోదావరి స్నాన ఘట్టం. ఆరోజు రాజనరేంద్రుని సభలో నన్నయ్యగారి ఆదిపర్వం ఆవిష్కరణ. 
ముగ్గురు బ్రాహ్మణుల సంభాషణ
మొదటివారు ద్రవిడ దేశంనుండి రాజపుత్రుడు కులోత్తుంగునితోబాటుగా ఈ సభకై వచ్చారు.
రెండవవారు దూర గ్రామం నుండి వచ్చిన సంస్కృత పండితుడు. మూడవవారు రాజాస్థానములోని కవి, పండితుడు.. 
1వ బ్రా.:- మీరాజావారి కులబ్రాహ్మణుడు నన్నయభట్టుగారు వ్యాస భారతమును మీభాషలోనికి అనువదించుచున్నారటగదా. ఆ సభకు కుమారుని అహ్వానించినారు.వారితో మేమును వచ్చినాము. 
2వ బ్రా :- నాకు తెలియదు. ఆంధ్రభాష వంటి జానపదుల భాషలో భారతమా? అసలు తగిన పదజాలమున్నదా? వ్యాకరణమున్నదా. చందస్సులున్నవా? ఈ మ్లేచ్చ భాషలో భారతమును ఎవరాదరింతురు? 
1వ బ్రా:- మా ద్రావిడభాషలో అనేక ప్రాచీన కావ్యములున్నవి. స్వతంత్రవృత్తములున్నవి. 
3వ బ్రా :- మా నన్నయగారి ప్రతిభనుగురించి మీ ఇరువురికి తెలిసినట్లులేదు. వారిప్పటికే పాణినీయ పద్దతిలో ఆంధ్రశబ్ద చింతామణిని కూర్చినారు. సంస్కృత శబ్దములు, దేశి ధాతువులతో మణిప్రవాళము వంటి భాషను నిర్మించినారు.తెలుగుకు తగిన సంస్కృత వృత్తములను నిర్ణయించినారు. 
2వ.: ఇది విఫలప్రయత్నమనే నా నమ్మకము. వాగ్దేవికి ఈభాషలు రుచించునా? ఆమెకు దుర్దినములు వచ్చినవి. 
3వ. బ్రా: నేను సభకుపోవుచుంటిని. నన్నయ్యగారు తెలుగులో వాల్మీకి మహర్షిని తలపించు ఆదికవిగా గుర్తింపబడుదురనే నా నమ్మకం. మీరిరువురూ నా వెంట రావచ్చును. 
1వ బ్రా: మీరెంత చెప్పినను నాకు నమ్మకములేదు. నేను యోగిని. నేను బ్రహ్మలేకమునకు పోయి అక్కడ సరస్వతీ దేవి ఈఔద్ధత్యమునకు ఎట్లు స్పందించుచున్నదో తెలుసుకొందును. 
2. వ బ్రా: - ఆ యోగప్రక్రియ నాకునూ తెలియును. నేను కూడా నా సందేహములను అక్కడనే తీర్చుకొందును. 

రెండవ రంగము - బ్రహ్మలోకము - సరస్వతీదేవి అత్యవసర సమావేశము.
ఆహూతులు వశిష్ఠ వామదేవాది మహర్షులు, కాళిదాసు, భవభూతి, మురారి, ప్రత్యేక ఆహ్వానితులు వాల్మీకి, వ్యాసుల వారు. 

 భారతావతరణము -2 
రెండవ రంగము - బ్రహ్మలోకము - సరస్వతీదేవి అత్యవసర సమావేశము.
ఆహూతులు వశిష్ఠ వామదేవాది మహర్షులు, కాళిదాసు, భవభూతి, మురారి, ప్రత్యేక ఆహ్వానితులు వాల్మీకి, వ్యాసుల వారు. 

బ్రహ్మలోకము - వాణీ హిరణ్యగర్భుల సభావేదిక - ఆహూతులు వచ్చు చున్నారు. రంభ నృత్యము చేయుచున్నది. మేనక సరస్వతీదేవి చరణములకు పారాణి అలంకరిస్తున్నది. దేవఋషి నారదుడు తన వీణయైన మహతిని వాయిస్తూ హరినికీర్తిస్తున్నాడు. హంస సరస్వతీదేవి రాజమహేంద్రవర సభకు ప్రత్యక్షముగా వెళ్ళదలచినచో వెంటనేవెళ్లుటకు సిద్ధముగా ఉన్నది. ఆహూతులు ఒకొకరే వచ్చుచున్నారని ద్వారపాలిక తెలిపినది. మొదట కవివరులు కాళిదాసు, భవభూతి, మురారి వచ్చినారు. సప్తమహర్షులు వచ్చినారు. సృష్టికర్త స్వస్థానమునకు వచ్చికూర్చున్నారు. వాల్మీకి, వ్యాసాదులు వేంచేసినారు.
బ్రహ్మా - సరస్వతీ నీవు మారిపోవుచున్నావు. గీర్వాణము తప్ప అంగీకరించని నీకు క్రొత్తభాషలమీద మోజు పెరిగినది.
సర:- స్వామీ అనంత కాలచక్రములో యుగములు, మహాయుగములు, కల్పములలో తమరు మారుటలేదా?

బ్రహ్మ:- ఇప్పుడే వాల్మీకి మహర్షులు వచ్చుచున్నారు.
వాల్మీకి:-దేవీ, భూలోకమున నాకొక ప్రత్యర్థి ఉదయించినాడు. ఆయనకూడా ఆదికవియేనట.
సర:- నన్నయగారు తమకు ప్రత్యర్థులా?
వాల్మీకి:- ఆయన నన్ను గురించి ఏమన్నారో చూడండి
హరిహరాజగజాననార్క షడాన్య మాతృ సరస్వతీ
గిరిసుతాదిక దేవతాతతికి నమస్కృతిఁజేసి దుర్భర
తపోవిభవాధికున్ గురు పద్యవిద్యకునాద్యు నం
బురుహగర్భవిభున్ బ్రచేతసుపుత్రు భక్తిఁదలంచుచున్
సర: అంబురుహగర్భవిభున్ - నిన్ను బ్రహ్మ అంతవానివి అన్నాడుకదయ్యా!
వాల్మీకి : దుర్భరతపోవిభవాధికున్ అనుటలో నాకవిత్వ ప్రసక్తి ఎక్కడ ఉన్నది? పద్యవిద్యకు ఆద్యుడని అన్నాడు. కవిగా నన్ను మెఛ్ఛుటకాదే. ఇది నేను తిరస్కారముగనే భావింతును.
భవభూతి:- మనందరమూ నేర్చినది పద్యవిద్యయే కదా. మనము వేదమంత్ర ద్రష్టలము కాదు. వేదాంగములను స్మృతులను నిర్మాణముచేసినవారముకాదు కదా!
వాల్మీకి:- ఆయన వ్యాసులవారిని ఎలా కీర్తించాడో గమనించండి.
భారత బారతీశుభగ భస్తిచయంబులఁజేసి ఘోరసం
సారవికారసంతమన జాలవిజృంభము వాపి సూరిచే
తోరుచిరాబ్జబోధనరతుండగు దివ్యుఁ బరాశరాత్మజాం
భోరుహమిత్రుఁ గొల్చి మునిపూజితు భూరియశోవిరాజితున్


ఆయనకు నాకంటె వ్యాసుడనిన అధిక భక్తి ప్రపత్తులు. ఆయన - ఘోర సంసారవికారసంతమసజాల విజృంభము - ఘోరమైన సంసారవికారమనే కటికచీకట్ల ప్రభావమును వాపినవాడట. సూరిచేతో రుచిరాబ్జ బోధనరతుండగు అంభోరుహమిత్రుడట - పండితుల హృదయపద్మములను ప్రకాశింపచేయు సూర్యుడట, దివ్యుఁడట, మునిపూజితుడట, భూరియశోవిరాజితుడట.
వ్యాసుడు - ఆయన నిన్ను బ్రహ్మ యంతటివాని వన్నాడు. నేను వ్రాసినదంతయు తారుమారుచేసినాడు. నాకావ్య రచనా శిల్పమును గౌరవించలేదే.

భారతావతరణము -3

భవభూతి - మహర్షి వాల్మీకీ! తమ మధుర కవితారసమును పానము చేయని భారతీయుడుండునా?
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్
వాల్మీకియను కోకిల కవితా వృక్షశాఖపై కూర్చుండి రామ రామ అను మధురాక్షరములు పలుకుచున్నది.
కాళిదాసు - వాల్మీకేర్ముని సింహస్య కవితా వనచారిణః - వాల్మీకి యను మునిసింహము కవితావనములో విహరిస్తూ తన గర్జనతో రామకథను వినిపించెనట. నన్నయ బెదరినాడేమో.
వాల్మీకి : నన్నయ ఆంధ్రీకరించునది భారతము. అతనికి వ్యాసుడనిన అధిక గౌరవము.
సర:- అందరకు స్వాగతము. కాళిదాస కవీంద్రా తమరు ఈసభకే వచ్చితిరా?
కాళిదాసు - వ్యాసులవారినుండి బ్రహ్మ వైవర్తమును విని ఉన్నాము. ఈనాడు తమ వివర్తశోభను తిలకించుటకు వచ్చితిమి.
సర:- నీ వివర్తశోభ రఘువంశములోనూ, భవభూతిది ఉత్తరరామచరితములోను మేముచూడ లేదా?
భవభూతి :- సిద్ధ చారణులు ఈయాంధ్రభాషా వివర్త రామణీకమును పొగడుచున్నారు.అతడి ప్రయత్నమును చూచి ధన్యులమౌదుమని వచ్చియున్నాము.
సర: అందరూ ఆసీనులుకండు. రాజమహేంద్రవరమున గ్రంధావిష్కరణ సభ ప్రారంభమగుచున్నది.

మూడవ రంగము
రాజ మహేంద్రవరము - రాజ రాజనరేంద్ర బిరుదాంకితుడైన చాళుక్య ప్రభువు విష్ణువర్ధనుని విద్వత్సభ.
సభాసదులందరూ ఆసీనులై ఉన్నారు. వైతాళికుల జయజయధ్వానాల మధ్య మహారాజు వచ్చి సింహాసనారూఢులైనారు.
నిశ్శబ్దం.
… …

బ్రహ్మలోకములోని సభలోని అందరి దివ్యదృష్టి రాజమహేంద్రవరము రాజ సభలోనే కేంద్రీకృతమై ఉన్నది.

భవభూతి : సభామర్యాదలు పూర్తి అయినవి. నన్నయ గారు లేచి నిలభడి భారతపఠనము ఆరంభించినారు
నన్నయ:
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే

కాళిదాసు: ఏదో క్రొత్త భాషయన్నారు. ఇది సంస్కృతమే. మరియొక సంస్కృత భారతమా?
భవభూతి : - వ్యాసుల కావ్యారంభము చిత్తగించండి:
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం
దేవీంసరస్వతీంచైవ తతోజయముదీరయత్
లోమహర్షణ పుత్రః ఉగ్రశ్రవాః సూతపౌరాణికో నైమిశారణ్యే శౌనకస్యకులపతేర్ ద్వాదశవార్షిక సత్రే
సమాశీనాన్ అభ్యాగచ్ఛద బ్రహ్మర్షీన్ సంశితవ్రతాన్
వినయావనతో భూత్వా కదాచిత్ సూతనందనః …
తెలుగా సంస్కృతమా అనేది ప్రశ్నకాదు. మొదటిశ్లోకంలోనే నన్నయగారి కవితామృతాన్ని ఆస్వాదన చేయండి. వ్యాసులవారు మొదట 8000 శ్లోకాలలో జయమును క్లుప్తముగా వ్రాసినారు. వారివద్ద విపులముగా విన్న వైశంపాయనుడు, జనమేజయుని సర్పయాగ సమయంలో భారతమును విస్తరించినాడు. ఆ సభలో రోమహర్షణుడు వినినాడు. ఆయన పుత్రుడు సూతుడు నైమిశారణ్యమున ద్వాదశ వర్ష సత్ర సమయమున చేసిన ప్రతిదిన ప్రవచనము లక్ష శ్లోకముల మహాభారతముగా వివర్తమొందినది. నన్నయగారు అనుసృజన చేసినది ఇది.

సర: - మనము తరువాత ముచ్చటించుకొనవచ్చును ఈ లోపల నన్నయ్యగారు "పాయక పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు" తనకు బహుభాషాకోవిదుడైన నారాయణ భట్టు తనకు తోడై నిలిచాడని చెప్పారు.
భవభూతి: - ఇంతకూ ఎవరు రచించినారు?
సర:- ఇంతకూ భారత యుద్ధమెవరు చేసిరి? పార్థుడా? పార్థ సారథియా?
… …
నన్నయ: -
సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకవితార్థ యుక్తి లో
నారసి మేలునానితరులక్షర రమ్యత నాదరింప నా
నారుచిరార్థ సూక్తినిధి నన్నయభట్టు దెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్

భవభూతి: - సంహితా అనుపదములోనే నన్నయ తనరచనకు పంచమవేద ప్రతిపత్తి కల్పించినాడు.

వ్యాసుడు (తనలో):
పురాణసంశ్రితః పుణ్యాః కథా వా ధర్మసంశ్రితాః
ఇతివృత్తం నరేంద్రాణాం ఋషీణాం చ మహాత్మనాః
తస్యాఖ్యానా వరిష్ఠాస్య విచిత్రపదపర్వణః
సూక్ష్మార్థ న్యాయాయుక్తస్య వేదార్థైర్భూషితస్య చ
బారతస్యేతిహాసస్య పుణ్యం గ్రంధార్థసంయుతాం
సంస్కారోపగతాం బ్రాహ్మీం నానాశాస్త్రోపబృంహితాం.

నన్నయ గారు చదువుతున్నారు
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని | యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని | కవివృషభుల్ మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని | యైతిహాసికులితిహాసమనియు
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ| యంబని మహా గొనియాడుచుండ
వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు | డాదిముని పరాశరాత్మజుండు
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై | పరగుచుండ జేసె భారతంబు

Wednesday, September 25, 2013

కూచి నరసింహం

'సింహత్రయం' గురించి చెప్పుకుంటున్నాము కదా! ఇప్పుడు మూడవవారైన కూచి నరసింహం గారి గురించి తెలుసుకుందాం...

కూచి నరసింహం (1866 - 1940) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి,  వీరికి ఆంగ్ల సాహిత్యంలో మంచి ప్రవేశం ఉన్నది. వీరు ఎలమంచిలి, నరసాపురం, నూజివీడు పట్టణాలలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేశారు. తరువాత పిఠాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చాలాకాలం పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
అనంతరం పిఠాపురం మహారాజా వారి సూర్యారాయాంధ్ర నిఘంటువు కార్యాలయంలో కొంతకాలం పనిచేశారు. వీరు శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర, గౌరాంగ చరిత్ర (1912) లను రచించారు. ప్రముఖ ఆంగ్ల నాటకకర్త విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. వనవాసి మరియు రూపలత అనే రెండు నాటకాలను రచించారు.

 'కొత్త తెనుగొచ్చింది' అన్న పద్యాలను వ్రాసినట్లు సమాచారం. వీరు రామచంద్రప్రభు శతకం రాసినట్లు తెలుస్తోంది. 


శ్రీ కూచి నరసింహం గారు శ్రీ రామకృష్ణ పరమహంస బోధలను పద్యాలుగా వ్రాసేటప్పుడు , అక్కడక్కడా వారు గౌరాంగ భక్తిని గురించి చెప్పిన విషయాలను చదివి గౌరాంగ చరిత్రను వ్రాయాలని సంకల్పించారు. వారు రాసిన  'గౌరాంగ చరిత్రము ' అనే పుస్తకం 1912 లో ప్రచురించబడింది. గౌరాంగుడు స్వయానా శ్రీకృష్ణుడి అవతారమేనని చెప్పబడుతుంది. అటువంటి గౌరాంగుడి జననం నుంచీ, ఆయన అవతార విశేషాలను పద్య రూపంలో ఈ పుస్తకంలో కూచి నరసింహం గారు రచించారు. అందులోని కొన్ని పద్యాలు....

పుట్టగానే గౌరాంగుడు కరిగించిన బంగారంలా మెరవడం చూసిన భక్తులు 'గౌరాంగుడు' అని నామకరణం చేసారట.

కరగించిన బంగారము 
తెరగున మిసమిసలుగ్రక్కు దివ్యతనువుతో 
మెరయుటచే దధ్భక్తులు 
గరమర్మిలి బిలుతురతని గౌరాంగాఖ్యా । 

పిల్లలు ఏడుస్తుంటే, ఏదో ఒక విధంగా ఓదార్చేందుకు తల్లిదండ్రుల మనసు విలవిల్లాడుతుంది . ఏదో విధంగా కావలసినవి ఇచ్చి, పిల్లల్ని ఓదారుస్తారు. ఆ విధంగా ఏడ్చి, కావలసినవి పిల్లలు సాధించుకుంటారు కదా. కాని, గౌరాంగుడు చిన్నప్పుడు హరి నామం వినగానే ఏడుపు మానేవాడట .నాలుగైదేళ్ళ ప్రాయంలో తల్లి తెల్లటి బట్టలు తొడిగి, బడికి పంపబోగా, వెళ్లక అతడు పారవశ్యంతో నాట్యం చేస్తుంటే, చూసే వారికి ఆనందభాష్పాలు రాలేవట.

నాలుగైదేళ్ళ ప్రాయంపు బాలుడౌచు 
జూపరందరు వివశులై చూడనతడు 
నర్తనముసేయు; వారలానందభాష్ప 
ములను రాలుతు రైహికంబులను మరచి 

ఈ పుస్తకం అంతర్జాలంలో చదివేందుకు, పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేందుకు , క్రింది లంకెను ఉపయోగించగలరు.

Saturday, September 14, 2013

పానుగంటి లక్ష్మీ నరసింహం

పిఠాపురం రాజాస్థానంలో పానుగంటి లక్ష్మీనరసింహం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కూచి నరసింహం అనేవారు ' సింహత్రయం' అనే పేరుతొ ప్రసిద్ధికెక్కారు. 

పానుగంటి లక్ష్మీనరసింహం గారు వ్యంగ్య రచనలో అందే వేసిన చెయ్యి. తెలుగు సాహిత్యంలో పానుగంటి రాసిన సాక్షి వ్యాసాలు  చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన తూర్పుగోదావరి జిల్లా, సీతానగరంలో 1865 నవంబర్ 2న జన్మించారు.   పిఠాపురంరాజా సూర్యారావు కోరిక మేరకు పానుగంటి అనేక నాటకాలు రాశారు. 

ఆయనను ‘ఆంధ్రా షేక్‌స్పియర్’, ‘ఆంధ్రా ఎడిసన్’ అని పిలిచేవారు. ఆయనకు ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు ఉంది.  ‘విప్రనారాయణ చరిత్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’, ‘రాధాకృష’్ణ, ‘కాంతాభిరామం’, ‘రాతిస్తంభం’, ‘కళ్యాణ రాఘవం’ లాంటి ఎన్నో రచనలను తెలుగు పాఠకులకు అందించారు.  


ఆయన రాసిన చాటువులు చూడండి  ...

వేపారి కంటె సరసుడు 
నేపాళపు మాత్రకంటే మేలౌ మందున్ 
వేపాకు కంటె చేదును 
సాపాటున కంటే సుఖము నహి నహి మహిలోన్ !

 బచ్చుండవు నెర దాతల
 మ్రుచ్చుండవు శత్రువులకు మహిత జ్వాలా
 చిచ్చుండవు కవి వర్యుల
మెచ్చుండవు మేటి సుగుణ పుట్టీ ! సెట్టీ !



 ఆ రోజుల్లో అవి కలిగించిన సంచలనం అంతా యింతా కాదు. "జంఘాలశాస్త్రి" అనే పాత్ర ముఖతః పానుగంటివారు సమకాలిక సాంఘిక దురాచారాలమీద, మూఢ విశ్వాసాలమీద పదునైన విమర్శలు చేసేవారుసాక్షి వ్యాసాల నుండీ కొన్ని మచ్చుతునకలు (వీకీపీడియా నుండీ)

(తోలు బొమ్మలు) -- తోలుబొమ్మలాటను చూడడంలోకంటె ప్రేక్షకులను పరిశీలించడంలో వాణీదాసునికి ఆసక్తి ఎక్కువ -- ఎన్నియోబొమ్మలను ముగ్గురో నల్వురో తెరలోపల నాడించుచుండ నొక్కబొమ్మను వీరందఱు తెరవెలుపల నాడించుచున్నారు. ఇంత శ్రమపడి బొమ్మలాట నేల చూడవలయు నని మీరు నన్నడుగుదురేమో! జనులు విశేషముగ జేరియుండినచోటికి బోవుటకు నాకు మొదటినుండియు నుత్సాహము. జనుల ముఖభేదముల బరిశీలించుట, కంఠరవములను శోధించుట, మాటలతీరులను గనిపెట్టుట, వానికిగారణములగు హృదయరసములను విమర్శించుట, స్వభావభేదములను గుర్తెఱుగుట-యిట్లు ప్రకృతిజ్ఞానమును సంపాదించుటయే నాముఖ్యోద్దేశము. పందిటిక్రింద నాడింపబడుచున్న నిర్జీవపు దోలుబొమ్మలను జూచుటకై పోయిన వాడ గాను. బయటనాడుచున్న ప్రాణమున్న తోలుబొమ్మలయాట జూడ బోయితిని.

(స్వభాష) - ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. -- మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా? ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. .. తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము.

చిలకమర్తి లక్ష్మీ నరసింహం

అటు తెనుగు సాహిత్య నాటక రంగాలకి, ఇటు సంఘ సంస్కరణోద్య మానికి మహోన్నత సేవలను అందించిన అపూర్వ వ్యక్తి కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. చిలకమర్తి పాఠశాలకు వెళ్లేటప్పుడే పద్యాలు రాయడం ప్రారంభించటమేగాక, ఆపై ఎన్నో రచనలు చేశారు. కీచకవధ ఆయన మొదటి నాటకం కాగా, ఆ తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలను రచించారు. నవలా రచనల్లో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇక హాస్య రచనల విషయానికి వస్తే.. "గణపతి" అనే నవల ఎన్నదగింది. 

22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చిలకమర్తి రచించిన "గయోపాఖ్యానం" అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయంగా చరిత్రలో నిలిచిపోయింది. పైగా ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేశారట. అందులోని ఒక పద్యం...


" అలరు గురువింద పూసలో నలుపున్నట్లు
గుణ గణముతోడ దోషముల్ గూడియుండు
ప్రాజ్ఞులు క్షమింతు రితరులు పరిహసింత్రు " - గయోపాఖ్యానం 
 
30వ ఏట నుండి రేచీకటి వ్యాధికి గురైనా ఏ మాత్రం బెదరకుండా, తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి చిలకమర్తి రచనలు కొనసాగించారు. 1908లో ఒక ప్రెస్ స్థాపించిన ఆయన... 1916లో మనోరమ, పత్రిక అనే పత్రికలను స్థాపించారు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర, సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. అలా ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చిలకమర్తిని "కళాప్రపూర్ణ పురస్కారం"తో సత్కరించింది.

 వీరి పేరు వినగానే, వెంటనే స్ఫురించేవి - నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు, వంటి పద్యోక్తులు, సామెతలు సంపాదించుకున్న ప్రాచుర్యాన్ని అందుకో జాలినవి. బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం: 

 భరతఖండంబు చక్కని పాడియావు
 హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి

అప్పటి దీన స్థితిగతులను తన స్వీయచరిత్రలో ఇలా వర్ణించారు...

'తెలుగు తెలియంగ దొరలకు తెలివి లేదు  ఇటువంటి దీన దశను తొలగించే దిక్కు దేశానికి కనపడటం లేదు. నేల దున్నుకొని బతకవచ్చుననుకొంటే భరించలేని వ్యవసాయం (శిస్తు) పన్ను. నీరు కావాలంటే నీటి పన్ను. వ్యాపారం చేయాలంటే ఆదాయపు పన్ను. సరకులమ్మాలంటే సంతపన్ను (వ్యాట్‌ పట్టణాలలో చూడబోతే మున్సిపాలిటీ పన్ను. పారిపోదామను  కుంటే బండి హాసీలు పన్ను, కొంప అమ్ముకోవాలంటే స్టాంపు పన్ను ఉన్నదేదో తిని ఉసూరుమంటూ బతుకుదామనుకుంటే ఉప్పు పన్ను. అధికారులకు లంచాలివ్వకపోతే ఏ పనీ కాదు. మునుసబు, కరణాలకు ముందుగా ముడుపులు ముట్టాలి. రైతుల కష్టాలు చూస్తుంటే వాళ్ళకు వ్యవసాయ ఫలం గడ్డి మాత్రమేలాగా కనపడుతున్నది. ఇళ్ళలో దరిద్ర దేవత వచ్చి తిష్ఠ వేసింది. ఏటేటా కాటకాలు తప్పటం లేదు. ప్రజలకు ఋణబాధ రోజు రోజుకూ అధికమవుతున్నది అని వేదన చెందారు చిలకమర్తి వారు.



 చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. అందుకే వాసురాయకవి చిలకమర్తి వారిది "ఫొటోజెనిక్ మెమరీ" అని ప్రశంసించారు. మంచి వక్త, శ్రోతలను బాగా ఆకట్టుకునే చిలకమర్తి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు. 
ప్రకాశం గారు,చిలకమర్తివారు   సహాధ్యాయులు.టంగుటూరి వారికి  వల్లెవాటు అలవాటు  చిన్నతనం నుండి ఉండేదట .ఆరోజుల్లో ధవళే స్వరంలో జరిగే ఉత్సవానికి ఇద్దరూ వెడుతూ వుండేవారట .ఒకసారి ఆ యాత్రలో టంగుటూరి వారిని వర్ణించారు చిలక మర్తివారు.ఆ పద్యం ఇది-
          సీ-     ఈగ వ్రాలిన గాని వేగా జారేడు నట్లు
                         మవ్వంపు కురులను దువ్వినాడు
               వరలలాటమునండు తిరు చూర్ణ రేఖను
                         ముద్దుగారేడు భంగి దిద్దినాడు
                అరుణ పల్లవ మట్లు  కరము రంజిల్లు,చెం 
                         గావి వస్త్రంబును గట్టినాడు 
                 చారలన్గారఖాను జక్కగా ధరియించి 
                         వలె వాటు కండువా వైచినాడు 
                    చెవుల సందున గిరజాలు చిందులాడ 
                     మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త 
                     టంగుటూరి ప్రకాశము రంగు మెరయ 
                       ధవళ గిరి తీర్ధము నకును  తరలివచ్చే!    

చిలకమర్తి లక్ష్మి నరసింహం గారు తమ రచనలలో చమత్కారాన్ని అందంగా పొదుగుతూ ఉంటారు. మచ్చుకి ఒకటి ....

ఆడిదం సూరకవి యొకనాడు తాటియాకుల మీద వ్రాయబడిన మహాభారతమును చేతబట్టుకుని నడిచిపోవుచుండగా నొక వెలమదొర వానిని చూసి ' అయ్యా ! ఈ వేళ వర్జ్యమెప్పుడు ' అని అడిగెను. నేను కవిత్వము చెప్పుదును గాని పంచాంగము చెప్పను. అందుచేత నాకు తెలియదని సూరకవి ప్రత్యుత్తరమిచ్సెను.' అంత పెద్ద పుస్తకము చదువుకోన్నవాడవు. నీకు పంచాంగము చెప్పుట తెలియదా ' అని ఆ వెలమ దొర కవిని పరిహసించి తన దారిని పోయెను.

మరునాడు ఆ వెలమ దొర తన చేతిలో పెద్ద కత్తి పట్టుకొని పోవుచుండగా సూరకవి వానిని సమీపించి ' అయ్యా ! నాకు క్షురకర్మ చేయగలవా ? ' అని అడిగెను. వెలమదొర ఆ మాటలు విని ఆశ్చర్యపడి కోపముతో ' నేను మంగలి ననుకొంటివా ' అని పలికెను. సూరకవి ఆ మాటలు విని ' కత్తి ఇంత పొడవుగా వున్నది. క్షురకర్మ చేయుటకు పనికిరాని దీని ప్రయోజనమేమి? ' అని పరిహసించి పోయెను.

 "పకోడి" గురించి
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు. "కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:
వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!
కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!

  కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని, లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు. కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు. సాధారణంగా వాడుకలో చెప్పే, ఆసేతు హిమాచలం అన్న ప్రయోగాన్ని, తుహినాద్రి మొదలు సేతువుదాల అని పైనుంచి క్రిందికి వరస చెప్పటం చిలకమర్తిశైలి చమత్కారం అనే చెప్పాలి.