Wednesday, October 7, 2015

అనుకోకుండా కేదారనాథ్ దర్శనం - పరిపూర్ణ గురుకటాక్షం

అనుకోకుండా కేదారనాథ్ దర్శనం - పరిపూర్ణ గురుకటాక్షం
-------------------------------------------------------------------
భావరాజు పద్మిని - 7/10/15 


"రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నాము గురూజీ. మా వారికి ఎప్పటినుంచో కేదారనాథ్ చూడాలని ఉంది. కాని ఒకప్రక్క పిల్లలు, ఒకప్రక్క పెద్దవాళ్ళతో వెళ్ళటం వీలుపడట్లేదు." అన్న సందేశం పంపించాను మా గురువుగారికి. 
బదులుగా చిన్న స్మైలీ వచ్చింది, అంతే. కాని, కనిపించిన ఆ స్మైలీ వెనుక, కనిపించని ఆయన అనుగ్రహం వర్షించడంతో, ఆ క్షణానే మా కేదారనాథ్ యాత్రకు, అన్నీ ఏర్పాటు అయిపోయాయి. క్షణాల్లో అసాధ్యాలని సుసాధ్యం చెయ్యగల ఆ కరుణామూర్తి దయ యెంత అపారమైనదో, నా చిన్ని బుర్రకు అప్పుడు తెలియలేదు.

మర్నాడు అమ్మా, నాన్నగారు, అత్తయ్యగారు, ఇద్దరు పిల్లలు, నేను, మా వారు అంతా కలిసి హరిద్వార్, రిషికేశ్ బయలుదేరాము. రాత్రికి హరిద్వార్ లోని  అవదేశానందగిరి స్వామి వారి ఆశ్రమంలో ముందుగా బుక్ చేసిన రూమ్స్ లో విడిది చేసాము. మేము వెళ్ళిన సమయానికి స్వామిజి అక్కడ లేకపోయినా, శిష్యులు చక్కగా అన్నీ ఏర్పాటు చేసారు. ఆశ్రమంలో ఉన్నవారికి ఉచితంగా భోజనం, అల్పాహార సదుపాయాలు అందించడం వారి ప్రత్యేకత. చక్కటి ఆశ్రమ వాతావరణం మమ్మల్ని ఆహ్లాద పరిస్తే, ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న 150 ఏళ్ళ చరిత్ర గల శివ పంచాయతనం కలిగిన మృత్యుంజయ ఆలయం, స్వామీజీ ఉండే గదిలో ప్రతిష్టించిన అతి పెద్ద పాదరస లింగం, రుద్రాక్ష చెట్టు చుట్టూ ప్రదక్షిణకు అనువుగా ప్రతిష్ట చేసిన శివలింగాలు మాలో భక్తిప్రపత్తులను ఇనుమడింపచేసాయి. మర్నాడు ఉదయమే, గంగా స్నానం, హరిద్వార్ లోని 'హరి కీ పౌడి' దర్శనానికి వెళ్ళాము.



మరకత మణుల ప్రవాహంలా ఆ గంగమ్మది ఏమి రంగో, ఏమి పొంగో. ఆ వేగం, వడి, స్వచ్చత చూసి, ఉప్పొంగిన కవి హృదయాలే వర్ణించడానికి పదాలు వెతుక్కుని, ... 'ఉత్తుంగ తరంగ రంగ...' అంటూ రాసారేమో. స్నానాలు, మా భావరాజు కుటుంబసభ్యుల (మొత్తం సుమారు 500 మంది పైనే ) క్షేమాన్ని కాంక్షిస్తూ, పితృదేవతలను స్మరించుకుని, తర్పణాలు వదిలాకా, దర్శనాలు ముగించుకుని, విడిదికి చేరాము. సాయంత్రం రిషికేశ్ చూసేందుకు వెళ్తూ ఉండగా, మా వారు మళ్ళీ ' నాకు కేదారనాథ్ చూడాలని ఉంది. అసలు ఈ జన్మకు అవుతుందో లేదో, ఇప్పుడే 40 లలో పడ్డాము. ఆనక ఓపిక ఉంటుందో లేదో!' అని మొదలుపెట్టారు. మే లో కాశికి వెళ్లి వచ్చాకా, ఆయనకు కేదారనాథ్ వెళ్లాలని, బలమైన సంకల్పం కలిగింది. అప్పటినుంచి ఆయన ఇలా అనటం బహుశా 30 వ సారేమో ! 

"ఒక్కరోజులో వెళ్లి రాలేమా ? కావలిస్తే, మనం అర్ధరాత్రే బయలుదేరదాము." అడిగాను నేను.

"ఇక్కడినుంచి 6 గంటలు (సుమారు ౩౦౦ కి.మీ ) గుప్త కాశి, లేక ఫాటా వెళ్తే, హెలికాప్టర్ ఉంటుంది. అందులో కేదారనాథ్ కు 10 నిముషాలు ప్రయాణం. ట్రై చెయ్యచ్చు, కాని, హెలికాప్టర్ దొరుకుతుందో లేదో, తీరా అంత దూరం వెళ్ళాకా లేకపోతే, మనం నిరాశగా వెనుదిరగాలి. అయినా, ఇప్పుడు 6 గం.కావస్తోంది, రేపు ఉదయాన్నే వెళ్ళాలంటే, ఎన్నో ఆలోచించాలి." అన్నారు మావారు. 

"ట్రై చెయ్యండి, ఆపై దైవానుగ్రహం." అన్నాను నేను. మా అమ్మా, నాన్నగారు 'పిల్లల్ని మేము చూస్తాము, హాయిగా వెళ్లి రండి' అన్నారు. వెంటనే మావారు కేదారనాథ్ స్వస్థలమైన వారి సహోద్యోగితో మాట్లాడారు. మెరుపు వేగంతో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మామూలుగా కొండ దారుల్లో అప్పుడప్పుడు జలపాతాల పారే నీటివల్ల రోడ్డు పాడయ్యి, ట్రాఫిక్ జాంలు అవుతూ ఉంటాయి. అందుకని, ఒక్కరోజులో  కేదారనాథ్ వెళ్లి రావటం (600km మొత్తం) అంటే కష్టమేమో నని, చీకటి పడ్డాకా, కొండదారుల్లో ప్రయాణానికి అనుమతించక ఆపేస్తారని, రాత్రి ఉండాల్సి వస్తే, అందుకు వీలుగా ఒక్కరోజుకు సరిపడా బట్టలు పెట్టుకోమనీ, వారు చెప్పారు. 

రిషికేశ్ లోని లక్ష్మణ్ ఝూలా, ఆలయాలు చూసి, రాత్రి 9 కల్లా, ఉదయం 4 గం. లకు మమ్మల్ని ఫాటా దాకా చేర్చాల్సిన వాహనం ముందుగానే ఆశ్రమానికి వచ్చి చేరింది. అప్పుడు పట్టుకుంది మావారికి భయం. స్వతహాగా తను భయస్తులు. కాని, కేదారనాథ్ చూడాలని కొండంత ఆశ. "పోనీ మానేద్దాం.. నాకు ఎందుకో భయమేస్తోంది." అన్నారు తను. 'మళ్ళీ ఇటువంటి అవకాశం మన జీవితంలో వస్తుందో లేదో, వెళ్ళాల్సిందే ' అంటూ నేను ఒప్పుకోక , స్కూల్ కు వెళ్ళను అని మొరాయిస్తున్న పసి పిల్లవాడిని చెవి పట్టుకు తీసుకెళ్ళే తల్లిలా ఆయన్ని తయారుచేసి, కారులో కూర్చోపెట్టి, తన ఒళ్ళో తలపెట్టుకు హాయిగా పడుకున్నా. ఆయన అలాగే చూస్తూ కూర్చున్నారు. కొండదారులు, చీకటి, ఘాట్. ఓ రెండు గంటల తర్వాత నేను నిద్ర లేచాకా నా చెయ్యి పట్టుకు కూర్చున్నారు.

'హిమగిరి సొగసులు' అన్న పాటను గుర్తుచేసేలా ఉన్నాయి పరిసరాలు. మాతో గంగమ్మ ౩౦౦ కి.మీ మేరా ప్రయాణించింది. నదీ గమనాన్ని బట్టి, రోడ్లు వేస్తారా అనిపించింది. దేవప్రయాగలో భాగీరధి, అలకనంద సంగమం, రుద్ర ప్రయాగ లో అలకనంద, మందాకినీ, కర్నప్రయాగలో సరస్వతి, భాగీరధి నదులు కలుస్తాయట. ఇవన్నీ కలిసి, గంగగా హరిద్వార్ కు వస్తాయి. రుద్రప్రయాగ, దేవప్రయాగ లోని సంగమాలు చూసాము. కేదారనాథ్ లో నివసించే మావారి సహోద్యోగి బంధువు, మాకు హెలికాప్టర్ ఏర్పాటు చేసారు, మేము దిగేసరికి అక్కడ సిద్ధంగా ఉంటానని ఫోన్ చేసారు. వారు అక్కడ పండా (పూజారి)గా తరతరాలుగా ఉన్నారు. కాసేపట్లో ఫాటా చేరుకుంటాము అనగా, జరిగిందొక అద్భుతం !

ముందు నాకళ్ళు చూసేది నమ్మలేదు. ఏదో హెలికాప్టర్ ఏమో అనుకున్నాను. కాస్త దగ్గరికి వచ్చాకా తెలిసింది, సుమారు ఐదడుగుల వెడల్పు ఉన్న అతి పెద్ద గరుడ పక్షి, రెక్కలు బారజాపి, మావైపే వచ్చింది. గోధుమ, బ్రౌన్ రంగులు కలగలిపి, యెంత మనోజ్ఞంగా ఉందో ! దానివేనుకే, అటువంటి మరో పక్షి. ఆశ్చర్యంతో నేను తేరుకుని, ఫోటో తీద్దాము, అనుకునే లోపే , వెనుదిరిగి, కొండల్లోకి మాయమయ్యాయి. 




సాధారణంగా గరుడ పక్షుల దర్శనం దుర్లభం. అలా కనిపిస్తే, అది చాలా మంచి శకునమని, పాపాలు అన్నీ పటాపంచలు చేస్తుందని, మింటనున్న దేవతల ఆశీర్వాదం తీసుకువస్తుందని, ఒక నమ్మకం. అటువంటిది... రెండు గరుడ పక్షులను మావైపే ఎగురుతూ వచ్చి, మమ్మల్ని పలకరించి వెళ్లినట్టు చూడడం ఒక మరపురాని అద్భుతం ! నిశ్చయంగా మా దంపతులపై ప్రసరించిన శివానుగ్రహం.

ఫాటా కాసేపట్లో చేరుకుంటాము అనగా, దూరాన కనిపిస్తున్న మంచు కొండలు మాకు కనువిందు చేసాయి. అక్కడికి వెళ్ళగానే, దిగిన పావుగంటలో, హెలికాప్టర్ సిద్ధంగా ఉంది.  విమానాప్రయాణం అలవాటే అయినా, చలిగా ఉన్నప్పుడు, 'ఏమే, ఆ ఫ్యాన్ తగ్గించు, హెలికాప్టర్ కింద పడుకున్నట్టు ఉంది,' అనటం తప్ప, ఎప్పుడూ హెలికాప్టర్ ఎక్కలేదు. సూర్యకిరణాలకు మెరుస్తున్న తళతళ లాడే గుండుతో పైలట్ గారు రంగ ప్రవేశం చేసారు, ఇదో గమ్మత్తు. "ఎక్కడుంటారు?" అన్నారు రాగానే. "చండీగర్" అన్నాము మేము. "ఆహా, నేను పంచకుల లో ఉంటా" అన్నాడు అతను. "మేమూ అక్కడే, సెక్టార్ -20 లో " అన్నారు మావారు. "హబ్బ, నేనూ అక్కడే, " అన్నాడు అతను. "మా ఫ్లాట్స్ లోనే అని కూడా అనకండి, "అన్నాము ఇద్దరమూ నవ్వుతూ. "లేదండి, మీకు దగ్గరలో ఉన్న ఆర్మీ సొసైటీ లో ఉంటాను, ఎప్పుడైనా కలుద్దాము,"అన్నారు ఆయన కూడా మాతో నవ్వుతూ.

  ప్రత్యేక కోటాలో బయలుదేరినట్టు, మేము ఇద్దరం, ఒక పైలట్ మాత్రమే హెలికాప్టర్ లో బయలుదేరాము. ఆ సమయంలో వేరే ప్రయాణికులు లేకపోవడం ఇంకో చిత్రం. బడాబడా హెలికాప్టర్ చప్పుడు చేస్తున్నా, నాకు అసలు భయం అన్నది లేకపోవడంతో, గురుస్మరణతో  ప్రయాణం ఆస్వాదించసాగాను. త్రోవ పొడవునా పైలట్, ప్రక్కనే కూర్చున్న నాకు కేదారనాథ్ కు వెళ్ళే కాలిబాటను చూపారు. అసలు భక్తి అంటే, కొండలూ, గుట్టలూ నడకతో,గుర్రాలపై 14 km ప్రయాణించి, నానాకష్టాలు పడి, శివదర్శనం చేసుకునే వారిదే కదా, అనిపించింది. ఇలా 3 నిముషాలు వెళ్ళగానే, "ఓహ్..!!!" కళ్ళముందు మరో అద్భుతం.



గురువు మీద గురి ఉంటే... గాల్లో తేలచ్చు, అద్భుతాలు చూడచ్చు, చెయ్యచ్చు, మనసారా జీవితాన్ని ఆస్వాదించవచ్చు, అనిపించింది, ఆ క్షణం ! మంచుకొండల మధ్య కైలాశ శిఖరంలా, కళ్ళముందు సాక్షాత్కరించిన భూలోక కైలాశం లాగా, దూరాన కేదారనాథ్ ఆలయం కనిపించింది. మనసు ఆనందంతో ఉప్పొంగింది. సరిగ్గా 10 వ నిముషంలో మేము అక్కడ దిగగానే, పూజారి మమ్మల్ని వచ్చి కలిసారు. మమ్మల్ని గుడి వంక తీసుకు వెళ్ళారు.

విలయానికి మౌనసాక్షిలా మిగిలిన ఆ ఆలయంలో ఎనలేని ప్రశాంతత, అద్భుతమైన శక్తి తరంగాలు. నా ఒళ్ళు దివ్యశక్తి తరంగాలతో ఊగిపోయేలా ఉంది. ఒక ప్రక్క గణపతి రూపులా, మరోప్రక్క అమ్మవారి శ్రీచక్రంలా, మరోప్రక్క శివలింగంలా అనిపిస్తూ, శివ పరివారాన్ని మొత్తంగా ప్రతిబింబించేలా ఉంటుంది కేదారేశ్వర జ్యోతిర్లింగం. పూజాసామాగ్రి తీసుకుని, ఆలయంలోకి వెళ్ళాకా, ఒక ప్రక్కగా కూర్చుని, సుమారు 15 నిముషాల పాటు అభిషేకం చేసుకున్నాము. మా పూజ పూర్తి అయ్యేదాకా, గర్భగుడిలో జనం అట్టే లేరు. మా పూజ అవ్వగానే, బిలబిల మంటూ వచ్చిన జనసందోహంతో కనీసం నిల్చునే స్థలం కూడా లేకుండా అయిపొయింది. ఇదొక విచిత్రం మాకు.

బయటికి వచ్చాకా, మా పూజాపాత్రలో ఉన్న సామాగ్రి చూస్తే, అందులో ఉన్న బ్రహ్మ కమలం అచ్చంగా గణపతి రూపులా అనిపించింది. గుడి వెనుక భాగంలో ఉన్న 'దివ్య శిల' ను చూపించారు పూజారి గారు. 2012 లో వరదలు వచ్చే ముందు, పైన ఉన్న చెరువు గట్టు తెగి, వరద పారే ముందు, సరిగ్గా ఈ ఆలయమంతే  వెడల్పు ఉన్న పెద్ద శిల దొర్లుకుంటూ వచ్చి, గుడి వెనుక భాగంలో అడ్డంగా నిలబడి, వరదలకు ఆలయం కొట్టుకుపోకుండా కాపాడిందట ! ఆలయానికి అటూ, ఇటూ ఉన్న ఇళ్ళు, కొట్లు అన్నీ ఆ ఉధృతికి నామరూపాలు లేకుండా పోయాయట. దైవలీలలు ఎంచడానికి మానవ మేధస్సు సరిపోదు.



పూజారి గారు దూరంగా ఉన్న తమ ఇంటిని చూపి, ఇలా అన్నారు," ఒక అంతస్థు మొత్తం మడ్డిలో కూరుకు పోయింది. మా ఇంట్లో 3 వ అంతస్తులో నేను, మావాళ్ళు , మరో 80 మంది దాకా, 3 రోజులపాటు అలాగే వరద, బురద, వానలో కూరుకుపోయి, ఆలయం వంకే చూస్తూ ఉన్నాము. శివుడి లీలలు విచిత్రమైనవి. వరదలో కొట్టుకు పోతున్నవాడిని ఈవలకు, మావద్దకు పడేసాడు. మావద్దనే కూర్చున్న వాడిని, వరదలో పడేసి, తీసుకుపోయాడు. అదృష్టం, చావో రేవో ఆయన దయ, ఎలాగైనా చేరేది ఆయన్నే అని నమ్మి అక్కడే ఉన్న 80 మందీ బ్రతికిపోయారు. అసలు అప్పటినుంచి నేను ఇక్కడ తక్కువే ఉంటున్నాను. రెండు మూడు రోజుల క్రితమే ఏదో పనిబడి ఇక్కడికి వచ్చాను. ఇదిగో, ఇలా మిమ్మల్ని కలిసి, దర్శనం, అభిషేకం చేయించమని, శివుడే పంపాడేమో !"

ఈ ప్రపంచంలో చెడునడవడి కల బిడ్డలు ఉంటారు కాని, చెడ్డ తల్లులు ఉండరు. అలా తల్లీ, తండ్రీ అన్నీ తామే అయ్యి,అవ్యాజమైన ప్రేమానురాగాలు వర్షించే ఆ దైవానికి ,ఈ చరాచర జగత్తులో మనం ఏమి సమర్పించినా, అది ఆయన సృష్టే తప్ప, మన సృష్టి కాదు కదా ! ధ్యానం, అవాకాశం ఇచ్చినప్పుడు చిన్నపాటి గురుసేవ చేసుకునే భాగ్యం దక్కిన నావంటి వారికి గురుఅనుగ్రహంతో దక్కిన అరుదైన వరం కేదారేశ్వరుడి దర్శన భాగ్యం.

బయటికి రాగానే  అమృతతుల్యమైన కేదారనాథ్ లోని పంపు నీరు మరికొంత తాగి, క్రింద ఉన్న చిన్న హోటల్ లో భోజనం ముగించుకుని, బయటికి వచ్చిన 10 నిముషాల్లో మా తిరుగు ప్రయాణపు హెలికాప్టర్ వచ్చేసింది. మధ్యాహ్నం 2.15 కు బయలుదేరి, తిరిగి, రాత్రి 9 గం. కల్లా, హరిద్వార్ చేరుకొని, మర్నాడు మధ్యాహ్నం చండీగర్ వెనక్కు వచ్చాము. అనుకోకుండా ఆన్నీ సమయానికి ఏర్పాటు కావటం, దుర్లభమైన శివ దర్శనం, అరుదైన అనుగ్రహాలు... కేవలం, గురుకటాక్షం. నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం.
//శివాయ గురవే నమః //

Sunday, May 10, 2015

ఈశ్వర తత్త్వం

పరమేశ్వరుడు ఎంతో సాత్వికుడు, బోళా శంకరుడు. పిలిస్తే చాలు పలుకుతాడు. ఆర్తిగా ప్రార్ధిస్తే అక్కున చేర్చుకుంటాడు. భక్తులను ఇట్టే కరుణిస్తాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా కోరిన వరాలు ఇచ్చేస్తాడు. నిరాడంబరతకు సంకేతంగా నిలిచే శివుడిని చూసినా, ఆయన నివాసమైన మరుభూమిని తలచుకున్నా మనసులో వైరాగ్యభావం జనిస్తుంది. పండితులైనా, పామరులైనా, మూగ జీవులైనా,శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, భక్తే ప్రధానం కానీ ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదని చాటిచెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు. అందరిని సమ దృష్టితో చూసే శివుడు అహాన్ని, భేద భావనను సహించడు అని తెలిపే రెండుమూడు కధలు సంక్షిప్తంగా చూద్దాము.

************************************************************************

ఒక‌నాడు శంక‌రాచార్యుల‌వారు గంగాన‌దిలో స్నానంచేసి వ‌స్తున్నారు. జ‌నం ఎవ‌రిక‌వారే మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఇటూ అటూ జ‌రిగి చేతులు మోడ్చుకుని విన‌యంగా దారి ఇచ్చి నిల‌బ‌డ్డారు. అంద‌రినీ చిరున‌వ్వుతో చూస్తూ ప్ర‌సన్న వ‌ద‌నంతో శంక‌రాచార్యులు ముందుకు న‌డిచారు. అక్క‌డి మాసి చిరిగిన బ‌ట్ట‌ల‌తో, దుమ్ముతో మ‌లిన‌మైన శ‌రీరంతో, చింపిరి జుట్టుతో చేత క‌ఱ్ఱ‌ప‌ట్టుకుని ఒక వ్య‌క్తి అడ్డంగా నిల‌బ‌డ్డాడు అత‌ని క‌ళ్ళ‌ల్లో నిర్ల‌క్ష్యం. అత‌నికి తోడు అత‌ని వెంట దుర్గంధం వ్యాపింప‌చేస్తూ నాల్గు కుక్క‌లు కూడా ఉన్నాయి. అవి కూడా వాటి య‌జ‌మాని స‌ర‌స‌న తోకాడిస్తూ నిలచిఉన్నాయి.


శంక‌రాచార్యుల‌వారి శిష్యుల‌కి ఆగ్ర‌హం వ‌చ్చింది. ఏయ్ ! ఎవ‌రు నువ్వు ? త‌ప్పుకో. ప‌క్క‌కు జ‌రుగు. క‌న్పించ‌డంలా ? మా గురువుగార్ని చూసి మ‌హామ‌హులే దారి ఇచ్చారే. నువ్వు మాత్రం క‌ద‌ల‌కుండా అలా నుంచున్నావ్‌. ఎంత నిర్ల‌క్ష్యం ? జ‌రుగు జ‌రుగు అన్నారు. చూడ‌బోతే ఛండాలుడు లాగా ఉన్నాడు అని వారు గుణుగుకున్నారు. శంక‌రాచార్యుల‌వారు అత‌న్ని చూస్తూ ఆగిపోయారు. అతడిని శిష్యులు ప‌రుషంగా మాట్లాడినందుకు నొచ్చుకుంటున్న‌ట్లుగా నాయ‌నా ! త‌ప్పుకుంటావా ? అని అన్నారు ప్రేమ‌గా. త‌ప్పుకుంటాను. కాని ముందు ఇది చెప్పు. నువ్వు త‌ప్పుకోమ‌న్న‌ది ఆత్మ‌నా ? ఈ శ‌రీరాన్నా ? శ‌రీర‌మా ? అంటే ఇది అస్వ‌తంత్రమైన ఒక కీలుబొమ్మ‌. ఆత్మ నా అంటే ఆత్మ అఖండ‌మ‌నీ అద్వితాయ‌మ‌నీ స‌చ్చిదానంద స్వ‌రూప‌మ‌నీ. నీవే ఉప‌న్యాసాలు ఇస్తున్నావుక‌దా ! నేను బ్రాహ్మ‌ణుడ‌నైనా చండాలుడ‌నైనా అందరిలాగా అన్న‌మ‌య‌మైన దీన్ని గురించి నీకెందుక ఇంత బేధ‌భావ‌ము ? అహంకారం పూర్తిగా న‌శించ‌నిదే అహం బ్ర‌హ్మాస్మి అని ఎలాబోధిస్తావో నాకు చెప్పు. నువ్వూ నేనూ వేరా ? అదీ చెప్పు అన్నాడు.

శంక‌రాచార్యుల మ‌దిలో ఆనంద త‌రంగాలు ఉవ్వెత్తున ఎగ‌సిపడ్డాయి. ఎక్క‌డో గ్రామ‌ల‌కి దూరంగా విద్య‌ల‌కు నాగ‌రిక‌త‌కూ దూరంగా మురికివాడ‌ల‌లో నివ‌సించే మురికి వానిలాగ క‌నిపించే ఈత‌డు మ‌హాజ్ఞాని. ఆత్మ‌విద్య‌ను అవ‌పోస‌న ప‌ట్టిన పునీతుడు. చండాలుడు అయితే అగుగాక‌. ఇత‌డు నాగురుతుల్యుడు అని భావించుకోగానే బ్ర‌హ్మాండ‌మంతా ఒక్క‌టిగా భాసించి అనంద తత్త్వాన్ని అందించిన‌ట్ల‌య్యింది.  

సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి, భ‌క్తి భావంతో  మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.

***************************************************************************
పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో  కాశీలో వుండి  తపస్సు చేసుకోసాగాడు.  ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది.  మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు.  అలా మూడు రోజులయింది.  ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు.  అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు.  సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి ? కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది.  అందుకే వారికి అహంకారం పెరిగి  తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది.  ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు.  మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు.  అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది.  తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది.  మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది.  కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది.  ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు.  వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే ,  ‘’వ్యాస నిష్కాసనం ‘’చరిత్ర సృష్టిస్తుందని ఊరడించి, ప్రతి అష్టమి నాడును ,ప్రతి మాస శివరాత్రి నాడును కాశీ ప్రవేశమునకు  వ్యాసునికి  అనుమతి నిచ్చాడు  దయామయుడైన  విశ్వేశ్వరుడు.

*******************************************************************************
కాశీలో 'గవ్వలమ్మ' అనే గ్రామదేవత ఉంటుంది. ఈమెకు ఐదు గవ్వలు కలిపి అల్లిన మాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఈమె విశ్వనాధుని సోదరి అని ప్రతీతి.
మడి, ఆచారాలు ఎక్కువగా ఉన్న గవ్వలమ్మ, కాశీ నగరంలో అందరినీ 'తప్పుకోండి, మడి, మడి...' అని ఒకటే విసిగించేదట ! రెండు మూడు మార్లు మందలించి, నచ్చజెప్పబోయిన విశ్వేశ్వరుడి ప్రయత్నం ఫలించకపోవడంతో... కోపించిన స్వామి... ఆమెను మాలపేటలో పడి ఉండమని, విసిరేసారట ! అందుకే, కాశీలో మడి, ఆచారాల పేరుతో ఎవరూ, మితిమీరి వ్యవహరించరాదట !

ఇది శివపురం... కాశీ, కేదార క్షేత్రాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రం. అనుక్షణం శివభక్తులు, అదృశ్య దేవతలు, సకల జీవరాశులు జపించే పంచాక్షరీ మంత్రం మార్మ్రోగే కాశీలో... అహాన్ని, కోపాన్ని, భేద భావనలను  వీడి, అనుక్షణం అత్యంత అప్రమత్తంగా మెలగాలని, గుర్తుంచుకోవాలి ! భక్తితో చేసే ప్రార్దనే శివానుగ్రహానికి రాచమార్గం !ఓం నమః శివాయ. 

Wednesday, April 29, 2015

వృక్షో రక్షతి రక్షితః...

'అరె ఈ మొక్క, ఇంకా ఎలా బ్రతికుంది ?' నాకు ఆశ్చర్యం, అంతకు మించిన ఆనందం. ఒకసారి దాని వద్దకు వెళ్లి ఆకుల్ని స్ప్రుశించాను. నాకు తెలుసు, మొక్కలు కూడా ప్రేమకు స్పందిస్తాయి. వినే మనసుంటే మాట్లాడతాయి, మనం పట్టించుకోవట్లేదని, అలుగుతాయి. మౌనంగా మాట్లాడే పక్షులు, వృక్షాలు ఈ సృష్టిలోని అతి గొప్ప నేస్తాలు నాకు.
మేము చండీగర్ వచ్చిన 6 నెలలకి గత డిసెంబర్ లో హైదరాబాద్ వెళ్ళాము. నాకు, మా అత్తగారికి మొక్కలంటే చాలా ఇష్టం. ఒక చిన్న పువ్వు పూసినా, చిట్టి గువ్వ కూసినా, ఇప్పటికీ ఆవిడ ఆనందంగా నన్ను పిలిచి చూపిస్తారు. హైదరాబాద్ లో మేము పెంచిన మొక్కలన్నీ ట్రాన్స్పోర్ట్ లో వేసేటప్పుడు, లారీ కాబిన్ లో జాగ్రత్తగా పెట్టించి, నీళ్ళు పోస్తూ, జాగ్రత్తగా తెమ్మని చెప్పాము. అయినా వాడు చేసిన ఆలస్యం వల్ల, అన్నీ చచ్చిపోయాయి. కాని వెళ్ళేటప్పుడు హైదరాబద్ లో, మా ఇంటి గుమ్మం వద్ద ఉండే ఆ క్రోటన్ మొక్కను మాత్రం అక్కడే వదిలేసాము.
6 నెలల తర్వాత కూడా ఈ మొక్క ఎలా బ్రతికుంది... అని దానికేసి చూస్తుండగా, మాకు నాలుగు ఫ్లాట్స్ అవతల ఉండే ఒక అరవావిడ వచ్చారు. 'మీ మొక్కకి నేనే నీళ్ళు పోసాను. మీ మొక్కకే కాదు, ఈ ఫ్లోర్ లో ఏ మొక్క ఎండిపోతున్నట్టు అనిపించినా, నీళ్ళు పోస్తాను, అది నా అలవాటు,' అన్నారు. ఆనందంతో ఆవిడకి కృతఙ్ఞతలు తెలిపాను.
యెంత గొప్ప అలవాటు ? ఇలా నేనూ చెయ్యగలనా ? నేనే కాదు, అంతా ఇలాగే చేస్తే యెంత బాగుంటుంది ? అనిపించింది. మంచిపని చేసేందుకు, చెడ్డ సమయం అంటూ ఏదీ ఉండదు కదా ! అందుకే, ప్రతి ఇంటివారు ఒక మొక్కని అయినా తప్పనిసరిగా పెంచాలి. చుట్టుప్రక్కల వారితో సంబంధాలు ఎలా ఉన్నా, మనం చేసే సేవ వృక్షాలకే కాబట్టి, తప్పనిసరిగా ఎండుతున్న మొక్కలకు నీళ్ళు పొయ్యాలి. ఇలా చేస్తామని, మనకి మనమే ప్రమాణం చేసుకుందామా...


Saturday, April 18, 2015

పడడం, ఓడడం జీవితంలో సహజమే !

పడడం, ఓడడం జీవితంలో సహజమే !

భావరాజు పద్మిని 

నాకెందుకో కధలు, కవితలు చదువుతూ భావుక లోకంలో విహరించడం కంటే, ప్రముఖుల ఇంటర్వ్యూ లు చదవడం చాలా ఇష్టం... ఎందుకంటే, వారు చూసిన ఒక నిండు జీవితం, ఆ జీవితం అందించే సందేశం, అమూల్యమైనవి. ఇవి మనకూ, కొన్ని సందర్భాల్లో చాలా ఉపయోగపడతాయి...

యాదృచ్చికంగా ఇవాళ పేపర్ తీసిన నాకు, టైమ్స్ ఆఫ్ ఇండియా లో ' ఇమ్రాన్ హష్మి ' తో ముఖాముఖి కనిపించింది. మామూలుగా అయితే అతనిపై ఉన్న అభిప్రాయాన్ని బట్టీ చదవకపోదునేమో ! కాని, ఆ ముఖాముఖి హెడ్ లైన్స్...నా దృష్టిని ఆకర్షించాయి...'  ఓటమి  సహజమే అని అయాన్ నాకు నేర్పాడు...' . ఎవరీ అయాన్... అనుకుంటూ చదవసాగాను...

అయాన్ అతని నాలుగేళ్ల కొడుకు. మిష్టర్ ఎక్ష్... అనే అతని కొత్త చిత్రం మూడు రోజుల్లో మొదలౌతుంది అనగా, అతని కొడుక్కి కాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది. ఒక నెల రోజుల విరామం తీసుకుని, అయాన్ కు సర్జరీ అయ్యి, ఖీమోథెరపీ మొదలై, అతను కోలుకుంటూ ఉండగా,  భార్యాపిల్లల్ని వదిలి, అతను షూటింగ్ కు వెళ్ళాడు. కాని, అతను షూటింగ్ లో నటిస్తున్నప్పుడు కాసేపు ఏమారినా, అతని తండ్రి మనసు, బిడ్డ కష్టానికి అల్లాడేది.

చాలా త్వరగా పైకొచ్చిన నటుల్లో ఇమ్రాన్ ఒకరు. అయితే వరుస వైఫల్యాలతో అలసి ఉన్నాడు. ఈ దశలో షూటింగ్ పూర్తి చేసుకుని, నాలుగు నెలల తర్వాత అతను కొడుకు వద్దకు వెళ్లేసరికి, అయాన్ తిరిగి స్కూల్ కి వెళ్ళసాగాడు. అతను 'స్పోర్ట్స్ డే ' పరుగులో పాల్గొనాలని అనుకున్నాడు. ఇంకా తన ఒంట్లో ఓపిక , శక్తి పుంజుకోలేదు. అయాన్ ను నిరాశపరచడం ఇష్టం లేక, మేమూ అతనితో వెళ్ళాము.... అప్పుడు జరిగిన సంఘటన, నన్ను కదిలించివేసింది...




సాధారణంగా, ఏ తల్లిదండ్రులైనా, తమకు యెంత గాయమైనా తట్టుకుంటారు. కాని, తమ బిడ్డకు ఏమైనా అయితే, అల్లాడిపోతారు. మేమూ, అదే దశలో ఉన్నాము, అయాన్ ఏమి చేస్తాడో అని మేము చూస్తూ ఉన్నాము. మూడడుగులు పరుగెత్తి పడిపోయాడు... మళ్ళీ లేచాడు. ఐదడుగులు పరిగెత్తి మరింత గట్టిగా పడిపోయి, గాయపడ్డాడు. అయినా, మళ్ళీ లేచి, పరుగును ముగించాడు. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, నేను నా భార్య పర్వీన్ వంక చూసాను, ఆమె కూడా ఉద్వేగంతో ఏడుస్తోంది. మేమిద్దరం కన్నీటి పర్యంతమయ్యాము... అతను పందెంలో చివర వచ్చినా, అందరికీ, 'నేనూ పాల్గొన్నాను,' అని చెప్పాడు. చిన్నవాడైనా, ఎన్ని అడ్డంకులు, బాధలూ అనుభవించినా, అతను శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. రేస్ పూర్తికాగానే, అయాన్ నా వంక చూసి, నవ్వుతూ, కన్నుగీటాడు.

ఒక బాబు, అన్ని కష్టాల తర్వాత కూడా, నవ్వుతూ, పరుగును ముగించి, 'తాను ప్రయత్నించాను...' అని చెప్తుంటే, ఇక అతని సంకల్పబలం ముందు నేనెంత !

ఆ క్షణం... పడినా, ఓడినా, పరవాలేదని, మళ్ళీ ఒక అవకాశం ఉంటుందని, ఇదంతా  జీవితమనే ఆటలో ఒక భాగమేనని, నాకు బలంగా అనిపించింది. "నీ కాళ్ళల్లో శక్తి లేక ఒణుకుతున్నా, యెంత గాయపడినా, పాకుతూనో, డేకుతూనో, కుంటుతూనో, ఎలాగైనా అక్కడే ఉండాలి, మళ్ళీ అడుగు వెయ్యాలి...." ఇది నా కొడుకు నాకు నేర్పిన పాఠం... అప్పుడు ఏ కష్టం ఎదురైనా, నేను ప్రయత్నం మాననని, నాకు నేనే ప్రమాణం చేసుకున్నాను...

ఫ్రెండ్స్, యెంత గొప్ప సందేశమో కదా ! ఎప్పుడైనా నిరాశకు గురైతే, ఈ సంఘటన గుర్తుకు తెచ్చుకోండి... ముందుకు సాగండి...

Friday, March 6, 2015

హోలీ రంగులు సహజ" సిద్ధం" గా

హోలీ రంగులు సహజ" సిద్ధం" గా... హెల్దీ హోలీ - హేపీ హోలీ
                                                                               తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
పసుపు
ఇది చాలామందికి తెలిసిన చిట్కా. పసుపుపొడిని నీళ్లలో కలిపితే చాలు. అవి చిక్కగా, పెద్దమొత్తంలో కావాలంటే ఆ నీళ్లలో శనగపిండి కలుపుకోవాలి. ఆ ద్రావణంతో స్నానం ఎంతో ఆరోగ్యకరం. పసుపు యాంటిబయాటిక్గా పనిచేస్తుంది. శనగపిండి మనశరీరంపై పట్టి మట్టిని శుభ్రం చేస్తుంది. సాధారణంగా నలుగుపెట్టుకోవడానికి ఈ పిండినే వాడతారన్నది అందరికీ తెలిసిందే. దీనికి కాస్త రోజ్వాటర్, కస్తూరి దట్టిస్తే ఇక ఆ సువాసన మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ శనగపిండి ఇష్టం లేదనుకోండి...మైదా, గోధుమ, వేరుశనగ పొడినీ వాడుకోవచ్చు. లేదంటే పసుపుచామంతి, పసుపు బంతిపూలు, తంగేడు పూల పొడిని నీళ్లలో కలుపుకోవచ్చు. ఈ పూలపొడిని లేదా పూలను నీళ్లలోవేసి మరగబెడితే రంగు స్పష్టంగా కన్పిస్తుంది.
ఎరుపు
ఎర్రచందనం పొడిని, ఎర్ర మందార పువ్వుల పొడిని ఎర రంగుకోసం వాడుకోవచ్చు. ఈ పొడికి మన ఇళ్లలో ఉండే ఏ పండిని కలిపినా పెద్దమొత్తంలో రంగును సిద్ధం చేసుకోవచ్చు. సింధూరపళ్లతోనూ ఎరుపురంగు ద్రావణం తయారుచేసుకోవచ్చు. ఎర్ర దానిమ్మ గింజలు, లేదా తొక్కలను నీళ్లలో మరగనిస్తే ఎర్రటిరంగునీళ్లు సిద్ధం అవుతాయి. రాత్రంతా ఎర్రమందార పూలను నీళ్లలో నానబెట్టి ఆ తరువాత వేడిచేస్తే చక్కటి ఆరోగ్యకరమైన ఎర్రటినీళ్లు సిద్ధమవుతాయి.
కాషాయరంగు
మోదుగ పూలతోకూడా కాషాయ రంగు నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు మోదుగపూలతో తయారుచేసిన రంగునీళ్లతోనే హోలీ ఆడాడని పురాణాలు చెబుతున్నాయి.. ఎండబెట్టిన మోదుగ పూలను, వాటి బెరడునుకూడా రంగుల తయారీకి వాడుకోవచ్చు.
నీలిరంగు
నీలి మందార పూలు, నీలిరంగులో మెరిసిపోయే జకరందా పూలతో పొడిని తయారు చేసుకోవచ్చు.
మెజంటా
బీట్రూట్ ముక్కలను రాత్రంతా నీళ్లలో నాననివ్వండి, పొద్దునే్న వాటిని మరిగించండి. చక్కటి మెజంటా రంగులో నీళ్లు సిద్ధం. ఇక ఎర్ర ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో రాత్రంతా నాననివ్వండి. పొద్దునే్న ఆ ముక్కల్ని తీసిపారేయండి. నీళ్లుమాత్రం ఎర్రగా మెరుస్తూంటాయి.
నలుపు
రాసి ఉసిరికాయలు, మామూలు ఉసిరికాయలని ఇనుపగినె్నలో మరిగిస్తే నల్లని నీళ్లు సిద్ధమవుతాయి. చల్లారాక వాటిని రాత్రంతా నిల్వ ఉంచితే పొద్దున్నకల్లా మరింత నల్లగా తయారవుతాయి. వాటివల్ల ఆరోగ్యంకూడా బాగుంటుంది. ఇక నల్లని ద్రాక్షపళ్ల గుజ్జును నీళ్లలో కలిపితే నల్లనిరంగు నీళ్లు తయారవుతాయి. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి. ఇక మందార ఆకుల పొడి, రంగురంగుల క్యాబేజీలు, క్యారెట్లు, బీర ఆకుల పొడి, గుమ్మడి గుజ్జుతోకూడా రంగరంగుల నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు. గోధుమరంగు
కిళ్లీలో ఎర్రటి రంగుకోసం వాడే కాసు - ఆ బెరడును నీళ్లలో మరగనివ్వాలి. దానికి కాస్త కాఫీ ఆకులు కలిపితే మంచివాసన, మంచి రంగు పడతాయి.
ఆకుపచ్చ
పొడిరంగు కావాలనుకుంటే గోరింటాకుల పొడిని, కాస్త మైదా, లేదా వరి పిండిలో కలుపుకుంటే చాలు. దీనికి ఎట్టిపరిస్థితిలోనూ నిమ్మరసం కలపొద్దు సుమా. అది కలిస్తే వచ్చే ఎరుపురంగు వచ్చేసి ఓ పట్టాన వదలదు. గుల్మొహర్ పూలనుకూడా ఎండబెట్టి పొడిచేసి ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు. గోధుమగడ్డిని ముద్దచేసి నీళ్లలో కలిపితే అదికూడా ఆకుపచ్చరంగులోనే ఉంటుంది. పుదీనా ఆకులనూ ముద్దగా నూరి నీళ్లలో కలిపితే ఆకుపచ్చరంగునీళ్లు సిద్ధం. పైగా ఇవి మంచి వాసననూ కలిగి ఉంటాయి. టమాటా, కొత్తిమీర ఆకులనూ ఇలా ముద్దగా చేసి నీళ్లలో కలపొచ్చు. గోరింటాకు పొడిని నీళ్లలో కలిపితే అవీ ఆకుపచ్చగా కన్పిస్తాయి.
ఓపిక లేని వాళ్లు ఈ ప్రకృతి ప్రసాదించిన పళ్లు, పూలు, కూరగాయలు, ఆకులతో తయారైన పొడిని అమ్మే ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి సరసమైన ధరలకు కొనుగోలు చేసుకోవచ్చు.

Sunday, March 1, 2015

తిరుమల దర్శనం

పవిత్రమైన తిరుమల కొండల దాకా వెళ్లి వద్దాం రండి...

పచ్చటి తివాసీలా ఉన్న ఒక కొండ గుండె గొంతుకలో కొట్లాడుతోంది...
అంతా నిశ్శబ్దం... ఆకు కూడా కదలట్లేదు. అప్పటి దాకా వగరు చిగురులు తిని, మధురంగా పాడిన కోకిల... ఎందుకో స్థబ్దుగా ఉండిపోయింది. సమస్త ప్రకృతి మౌనం వహించి, గుండె చేతబట్టుకుని ఎదురుచూస్తోంది... అవును మౌనం కూడా ఒక భాషేగా ! ముగ్ధమైన హృదయభాష !

పగలూ రేయి, భక్తుల విన్నపాలతో అలసిన స్వామి, కాస్తంత సేద తీరేందుకు ఆ కొండకు  విహారానికి వస్తున్నారట ! ఎంతటి శుభవార్త ! అనంతమైన తన రూపాన్ని, జీవకారుణ్యంతో ఆరడుగులకు కుదించుకుని, అరవింద లోచనాలతో ఆజానుబాహుడై, విచ్చేసిన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు, అచటికి విచ్చెయ్యనున్నాడు. ఎంతో తపస్సు చేసిన యోగుల హృదయాల్లో గోచరించే ఆ దివ్యమంగళ రూపం, దుర్లభమైన ఆ మనోవాచామగోచరమైన దివ్యతేజస్సు దర్శనం, తమకు లభించబోతోంది. మానులైనా, మొక్కలైనా, మూగాజీవాలైనా, స్వామి మనసుతో పంపిన ఆ చల్లటి కబురు విని, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, ఇంద్రియాలు కైంకర్యం చేసి, వేచి ఉన్నాయి.

ఎక్కడో దూరంగా అడుగుల సవ్వడి. స్వామి వస్తున్నారన్న వార్తను మలయసమీరం అల్లనల్లన మోసుకు వచ్చి, అందించింది. స్వామి వచ్చే బాట వెంట ప్రకృతి పూల తివాసీ పరచింది. ఆయన మృదువైన పాద పల్లవం మోపిన చోటున,  పుడమి పులకించిపోతోంది. శిలలు స్వామికి స్వాగత తోరణాలు కట్టాయి. కృష్ణ జింకలు, లేళ్ళు, దుప్పులు చెంగుచెంగున గెంతుతూ తమ ఆనందాన్ని తెలియచేసాయి. పక్షులు రెక్కలు అల్లారుస్తూ, ఆయన నడిచే బాట వెంట సందడి చేస్తూ, ఎగురసాగాయి. నీలమేఘశ్యాముని చూసిన వన మయూరం, నీలిమబ్బును చూసినట్లు పరవశించి , పురివిప్పి ఆడసాగింది. గానం మరచిన కోకిల, గొంతు సవరించుకుని, తిరిగి మధురంగా పాడసాగింది.

చెట్లు తలలు లయబద్ధంగా ఊపుతూ, స్వామికి వీవెనలు వీచాయి. ఆకాశగంగ ఉరకలు వేస్తూ వచ్చి, ఆయన పాదాలు కడగాలని ఉవ్విళ్ళూరుతోంది. చిట్టిపొట్టి ఉడుతలు రామావతారం తర్వాత తిరిగి స్వామి స్పర్శకు నోచుకోవాలని, ఆయన చుట్టూ తిరగసాగాయి. కొండ అంచును తాకే మేఘాలు, చిరుజల్లులతో స్వామిని అభిషేకించ సాగాయి. అవి, రాలే పూల పరిమలాలతో కలిసి, పూలవానగా మారి, స్వామి తనువు తాకాలని తపిస్తున్నాయి.

పాములు, కొండ చిలువలు, చిరుతలు, ఏనుగులు వంటి క్రూర మృగాలు సైతం, తమ స్వభావాన్ని మరచి, జీవశక్తిని అంతా కళ్ళల్లో నింపి స్వామినే చూడసాగాయి. పగలూ రేయి కలిసే ఆ కెంజాయ రంగు తొలి సంధ్యలో, సూర్యచంద్రులు చెరో వైపూ చేరి, గగనాన విప్పారిన స్వామి నయనాల్లా వెలుగొందుతున్నారు. స్వామి తనను అధిరోహించాకుండానే వేం చేసారని, ఆయన ఆజ్ఞానువర్తి అయిన గరుడుడు విశాలమైన రెక్కలు చాచి, విహంగ వీక్షణం చేస్తూ,  ఆయన పిలుపుకై వేచిఉన్నారు.

కొండ దారి వెంట సాగుతున్న ఆ లీలామానుష వేషధారిని, ఆ సింహేంద్ర మధ్యముడిని చూసిన ఒక గోవు గోముగా ఆయన్ను ఇలా అడిగింది " స్వామి ! కృష్ణావతారంలో నీవు సమ్మోహనంగా వేణువు ఊదావు కదా ! ఏదీ ! మరొక్కమారు మాకోసం ఆ మురళీరవం వినిపించవూ !"
కరుణా సముద్రుడైన స్వామి , దాపునున్న ఒక వెదురు కర్రను  అందుకున్నారు. క్షణాల్లో అది తనను తాను శూన్యం చేసుకుని, వేణువు గా రూపాంతరం చెందింది... స్వామి మోవి స్పర్శకై సన్నద్ధమవుతూ, నిలువెల్లా ఆయన ఊపిరిని నింపుకొవాలన్న ఆత్రంతో , ఆర్తిగా పరితపిస్తూ !


చిగురుమోవిని  వెదురుకు ఆన్చి, జీవనాదాన్ని శ్వాసగా పంపారు స్వామి. ఓహో, ఎంతటి మధుర రవళి. చంచల హృదయాల్ని సైతం క్షణాల్లో నిలువరించే వీనుల విందైన అమృతపాతమది. నెమ్మదిగా, మంద్రంగా మొదలై... ఒక్కొక్క ప్రాణిని అల్లేస్తోంది. కొండలూ, లోయల్లో ప్రతిధ్వనిస్తోంది. జీవాత్మల్నిఆవరించేస్తోంది... వేణుగానం తారాస్థాయికి చేరుకుంది...

ఏవీ , ఇప్పుడా మొక్కలు, పక్షులు, జీవాలు అన్న వివక్ష ఏది ? అన్నీ స్వామే ! అంతా స్వామే ! తమనుతాము మరచిన జీవులు ఒక అద్భుతమైన ప్రశాంతతలో లయమయ్యాయి. జీవాత్మ పరమాత్మతో మమేకమయ్యే అలౌకిక స్థితి అది.

ఇంతలో ఎక్కడో అందెల సవ్వడి. స్వామి వేణుగానానికి అలమేలుమంగమ్మ కూడా కదిలి, కొండెక్కి వచ్చింది. తన దేవేరిని అక్కున జేర్చుకుని, నెమ్మదిగా నడవసాగారు స్వామి. మెరుపుకు మేఘం తోడైనట్లు ఆ చక్కని జంటను, కన్నుల పంటగా చూడసాగాయి జీవులన్నీ.
అందరినీ మైమరపింప చేసిన స్వామి, తన దేవేరితో కలిసి, నెమ్మదిగా అదృశ్యమయ్యారు. చిత్రంగా, ఆయన పాదముద్రలు మాత్రం అలాగే ఉన్నాయి... వేల గుండెల్లో.

తిరుమలకు వెళితేనే స్వామి దర్శనం కలుగుతుందా ? ఆర్తితో కన్నులు మూసుకుని, 'స్వామీ !' అని ప్రేమగా పిలిస్తే, ప్రతి మనసులోనూ, సాక్షాత్కరిస్తుంది, ఆ సహస్ర చంద్రసమభాసుని దివ్య దర్శనం. రండి, మనోవేగంతో తిరుమల కొండల్లో విహరిద్దాం ! ఆకులో ఆకుగా, చినుకులో చినుకుగా మారి... ఆ కొండగాలులతో కలిసి పాడదాం. 'గోవిందా ! గోవిందా !' అని నిత్యం మార్మ్రోగే ఆ ఆనందనిలయంలో, గోవింద నామంతో మమేకమవుదాం. కళ్ళముందు కానవచ్చే వైకుఠం తనివితీరా చూసి, జన్మలు ధన్యం చేసుకుందాం !

(దూరమో, భారమో తిరుమలకు వెళ్లి, 3-4 ఏళ్ళ పైనే అయ్యింది. మా కోసం చండీగర్ లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు, స్వామి ఎదుట ఉండగా, నాలో కలిగిన భావనలు - భావరాజు పద్మిని.)

Saturday, February 21, 2015

అండగా నిలబడండి

అండగా నిలబడండి 
- భావరాజు పద్మిని 21/2/15 

మా వారి ఉద్యోగరీత్యా, మేము బెంగుళూరుకు రెండు సార్లు వెళ్ళటం జరిగింది. మొదటి సారి ఉన్నప్పుడు, మహాలక్ష్మి లేఔట్ లో ఒక మూడంతస్తుల ఇంట్లో రెండవ అంతస్తులో ఉన్నాము. అప్పుడు క్రింది రెండు వాటాల్లో ఉన్నవారితో మాకు మంచి స్నేహం ఉండేది. అంతా, దాదాపు సమవయస్కులమే !ఏడాది తిరిగేసారికి, కాన్పూర్ బదిలీ అయ్యి, వెళ్ళిపోయాము. తర్వాత విజయవాడ లో ఉండగా, మళ్ళి బెంగుళూరు వెళ్ళవలసి వచ్చింది. అందరికంటే క్రింది వాటాలో ఉన్న స్నేహితురాలు, అప్పటినుంచి అక్కడే ఉంది. అంతేకాక, మునుపు మేమున్న పైవాటా నే మళ్ళీ ఖాళీ అవుతోందని తెలిసింది. ఆ కాలనీ లో ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు, అక్కడి కన్నడం వారంతా నా వద్దకు వచ్చి, ఆత్మీయంగా పలకరిస్తుంటే, మా వారు ఆశ్చర్యంగా చూసారు,నిన్నుఇంత మంది అభిమానిస్తారా, అనుకుంటూ !
మళ్ళీ రెండవసారి అదే ఇంట్లో దిగాము. క్రింది వాటాలో ఉన్న స్నేహితురాలు సుమన్ గత 5 ఏళ్ళుగా అక్కడే ఉంది. మేము వెళ్ళాకా, తను ఉద్యోగాలకై ప్రయత్నిస్తుంటే, అక్కడి 'ప్లానెట్ కిడ్స్' అనే స్కూల్ లో తనకు ఉద్యోగం వచ్చింది. అప్పటిదాకా సాధారణ గృహిణిగా ఉంటూ, వెన్నెల్లా నవ్వే ఆమెలో మార్పు వచ్చింది. వాతావరణం మారేసరికి అందరిలాగే... ఆమెకు డబ్బుజబ్బు చేసింది. ఎక్కువ మాట్లాడేది కాదు, కాస్త టెక్కు చూపేది. నేనూ, అర్ధం చేసుకుని, కాస్త దూరంగానే ఉండేదాన్ని. అయితే, మొదటి అంతస్తులో ఉన్న 'ముక్త' అనే స్నేహితురాలు ఒకసారి ఆసుపత్రిపాలైతే, నేను వారి కుటుంబానికి, పిల్లలకు కాస్త సాయం చేసాను. అందుకే ఆమెకు నేనంటే మనసు నిండా ప్రేమ. అక్కడి నుంచి వెళ్ళిపోయినా, ఎక్కడున్నా, ఆమె నాతో మాట్లాడుతూనే ఉండేది. సుమన్ మాత్రం నా నెంబర్ ఆమెకు తెలిపినా, దూరంగానే ఉండేది.
కొన్నేళ్ళకి మేము హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడి నుంచి చండీగర్ వచ్చాకా, నా నెంబర్ మారి వారితో సంబంధాలు తెగిపోయాయి. అయినా, వాట్స్ ఆప్ లో ముక్త నెంబర్ కనిపిస్తే, పలకరించాను. ఆమె చాలా సంతోషించిది. నాతో మాట్లాడాలని ఉందని, మనసారా ప్రార్ధించానని, దైవమే మరలా మార్గం చూపారని, మురిసిపోయింది. తనే నా నెంబర్ సుమన్ కు ఇచ్చింది. అయినా, సుమన్ పెద్దగా మాట్లాడేది కాదు. ఒక సారి హై అంది, అంతే. తర్వాత మధ్య మధ్య మాత్రం ఇటువంటి మెసేజ్ లు వచ్చేవి.
'సాయి బాబా దీవెనలు. ఇది సాయి బాబా ఒరిజినల్ ఫోటో. ఇది 50 మందికి షేర్ చెయ్యకపోతే, మీకు చెడు జరుగుతుంది. లేకపోతే మంచి జరుగుతుంది...' నన్నే ఎంచుకుని మరీ పంపాలా ? భేతాళుడు 'రాజా ! నీ తల వెయ్యి ముక్కలౌతుంది' అనే డైలాగు గుర్తు తెచ్చుకుని, నవ్వి ఊరుకునేదాన్ని.


రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 3 రోజుల క్రితం తన నుంచి మెసేజ్ వచ్చింది. 'పద్మిని, ఎలా ఉన్నావ్, పిల్లలు ఎలా ఉన్నారు...' అని. నేను ఆశ్చర్యంగా బాగున్నారు, అనగానే... 'నాకు ఆరోగ్యం బాలేదు, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, హాస్పిటల్ లో ఉన్నాను. నా కోసం ప్రార్దిస్తావా ?' అంది. తప్పకుండా, అంటూ తనతో మాట్లాడుతూ ధైర్యం చెప్పాను. నిన్న కూడా మాట్లాడుతూ... 'ఏవిటో ఇప్పుడు మనుషులకు ఒకరికోసం ఒకరికి టైం లేదు, ముక్త ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది, అంతా బిజీ, అంది. వెంటనే నేను తనతో ఇలా అన్నాను...
'సుమన్ ... నీకో సంగతి చెప్పనా, నేను ఇప్పుడు రచనా రంగంలో స్థిరపడ్డాను. నాకంటూ కాస్త చోటు సంపాదించుకున్నాను. ఒక పత్రిక పెట్టాను. 3 రోజుల్లో వార్షిక సంచిక విడుదల. రోజుకి కేవలం 6 గంటలు నిద్రపోతూ పనిచేస్తున్నాను. అయినా, నీకు ఇదంతా చెప్పకుండా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా ?
మా గురుజి దయ వలన నాకు మనుషుల్ని మేధతో, కళ్ళతో చూసి అంచనా వెయ్యకుండా, మనసుతో చూసే గుణం అలవడింది. తను చిన్న సమస్యే అని చెప్పినా... తను ఆగాగి మాట్లాడుతుంటే, తన కంట్లోని కన్నీరు నా మనసుకు గోచరిస్తోంది.నువ్వు చాలా అవసరంలో ఉన్నావు. నీకు ఎమోషనల్ సపోర్ట్ కావాలి. కేవలం డబ్బు, వస్తువులు ఇవ్వటమే దానం కాదు... అవసరమైనప్పుడు కాస్తంత ఆత్మీయత, వాళ్లకు నీ సమయం, నీ ప్రేమ, నీ ఓదార్పు, ఇవన్నీ ఇవ్వటం కూడా దానమే అని చెప్పారు మా గురూజి. ఆయన మాటలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాను. ఒకవేళ నాకు దైవం ఇటువంటి అవకాశం ఇస్తే, ఖచ్చితంగా వదులుకోను. అండగా నిలబడతాను, ప్రార్ధిస్తాను, మీరు కోలుకుని బాగుంటే, నన్ను మర్చిపోయినా, ఆనందంగా చూస్తుంటాను.
ముక్త , ఇంకా ఇతరులు ఎలా ఉన్నా, మనుషుల తప్పొప్పులు ఎంచకుండా బేషరతుగా మనం ప్రేమించాలి. వారు ఆనందంగా ఉన్నప్పుడు పార్టీ లకు వెళ్లి డాన్సులు చెయ్యకపోయినా సరే, దుఃఖం లో, అవసరంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ చెయ్యి గట్టిగా ఒడిసి పట్టుకోవాలి. నీది ఎంతో మంచి మనసు, అపురూపమైన వ్యక్తిత్వం, నిన్ను అందరూ ప్రేమిస్తారు. ధైర్యం కోల్పోవద్దు. నీ సమస్య పెద్దదే కావచ్చు ! కాని, దైవానుగ్రహం అపారమైనది. ఇది గుర్తుంచుకో. ప్రేమను పంచుతూ మసలుకో !'
'నిన్ను చూస్తే, నాకు గర్వంగా ఉంది పద్మినీ !'
' ఇందులో నా గొప్ప ఏమీ లేదు. గర్వపడాల్సింది అంతకంటే లేదు... అంతా గురుఅనుగ్రహం అంతే ! మనిషిలో అంతర్గత మార్పు కేవలం సద్గురువే తీసుకురాగలరు. నీ అభినందనలు ఆయన పాదాలకు సమర్పిస్తున్నాను. సుఖంగా ఉండు.'
ఈ కధ మీకు చెప్పడంలోని అంతరార్ధం మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఎవరైనా, ఇబ్బందుల్లో, వేదనలో ఉన్నప్పుడు, వాళ్ళు గతంలో చేసిన పనులనే నెమరు వెయ్యకుండా, అన్నీ మరచి, వారికి అండగా నిలబడండి. వారికై ప్రార్ధించండి. ప్రేమగా ధైర్యం చెప్పండి. దైవం మీపట్ల చాలా కృప చూపుతారు. ఇది ముమ్మాటికీ నిజం !

Friday, February 13, 2015

నువ్వు బంగారానివి తల్లీ

'నువ్వు బంగారానివి తల్లీ...' అంటారు.
మట్టిలో పడున్న బంగారం అంతగా మెరవాలంటే , ఎన్ని సార్లు మంటల్లో మరిగిందో... ఇంకెన్ని అగ్ని పరీక్షలకు తట్టుకుంటే వన్నె, మెరుపు తగ్గకుండా ఉండగలదో. తాను పడ్డ బాధనంతా గుండెల్లో దాచుకుని, ఇతరుల సింగారానికి, సంతోషానికీ తన మెరుపును త్యాగం చేసిందో....
బంగారం మెరుపు అందరికీ కావాలి. కాని, అలా అయ్యేందుకు అది పడ్డ కష్టం, వాళ్ళ లెక్క లోకి రాదు. తమకు కావలసినట్టు మలచుకోవడానికి, కాల్చి, కాల్చి తమకు కావలసినట్లు ఇంకెంత వంగదియ్యాలో... 
ప్రతీ రోజూ ఒక కొత్త పోరాటం . అడుగడుగునా సవాళ్లు. ఇదే జీవితం. ఇదే నిజమయితే నేను బంగారాన్నే. మంటలు, పరిస్థితులు, మనుషులు, మనస్తత్వాలు మలచిన బంగారాన్ని....

(ఒక ఉద్వేగ క్షణంలో అలవోకగా వచ్చిన మాటలకు అక్షర రూపం - భావరాజు పద్మిని)



తృప్తి ఎక్కడ ?

నేస్తాలూ...

ఆ మధ్యన ఒక వ్యక్తిని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నారు.... ఈ మాటలు నా మనోపధంలో ముద్రించుకు పోయాయి...

"చూడండి... మీరు యెంత కష్టపడి, ఎన్ని కోట్లు సంపాదించి, పిల్లలకు ఇచ్చినా... వాళ్ళు ఏమంటారంటే...
మా నాన్న ఉన్నాడు చూసారా? దొంగ వెధవ... అదిగో ఆ ఎదురుగుండా ఉన్న భవంతి ఉంది కదా, అది నాకు ఇవ్వకుండా పోయాడు, చచ్చినాడు.

మా అమ్మ ఉందే ! ఎంత చాకిరీ చేసాను, చివర్లో కాసులపేరు కోడలికి ఇచ్చి పోయింది..." 

మనిషికి తృప్తి ఎక్కడండి ? ఎంత ఇచ్చినా, ఇచ్చింది గుర్తుండదు. ఇవ్వని దాన్నే చెప్తారు. అందుకే, నేనైతే నా పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకోవట్లేదు. వచ్చిననంత వస్తుంది. ఉన్నంతలో విద్యాబుద్ధులు చెప్పించాను, పెళ్ళిళ్ళు చేస్తాను. నేను ముప్ఫై ఏళ్ల నుంచే తీర్థ యాత్రలు చేస్తున్నాను. అదనంగా వచ్చిన సొమ్మంతా దానధర్మాలకు వాడేస్తాను. పిల్లలకు అతిగా ఆస్థులు ఇవ్వడం అంటే, వాళ్ళను కష్టం తెలియకుండా ఇంక్యుబేటర్ కోళ్ళు పంచినట్లు పెంచడమే ! ఈ విధానం వల్ల వాళ్ళు భవిష్యత్తులో చాలా కష్టపడతారు. మీకు నిజంగా పిల్లలపై ప్రేమే ఉంటే, వాళ్లకు చదువుసంధ్యలతో పాటు కాస్తంత ఆస్తినే ఇవ్వండి. 

వాళ్లకు బెంజి తెలియాలి... గంజి తెలియాలి. లోకం చూడాలి, అనుభవం పెంచుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా చెయ్యాలి. బాధ్యతాయుతంగా పెంచాలి. ఇక ఆస్థి తక్కువ ఇస్తే, వాళ్లకు అనుకోని అవసరాలు వస్తే... అంటారా ? నేను ఈ రోజున చేసిన దానధర్మాలు వాళ్ళను అవసరంలో ఆదుకోకపోవు. దైవానుగ్రహం ఉన్న వాళ్లకు జీవితంలో డోకా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అతిగా ఆస్థులు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టకండి ..."

నేనలా ఆయన చెప్తుంటే చూస్తూ ఉండిపోయాను. ఎంత చక్కగా చెప్పారు... నిజంగా 'వసుధైక కుటుంబకం ...' అన్న వారి సూత్రం అంతా పాటించగలిగితే, ఈ దేశంలో పేదరికం, ఆకలి ఉండవు కదా !


Thursday, February 12, 2015

జ్వాలాదేవి -నవదుర్గల ఆలయాలు -2

జ్వాలాదేవి -నవదుర్గల ఆలయాలు -
---------------------------------------------
భావరాజు పద్మిని 

మర్నాడు ఉదయం మా అత్తగారు, పిల్లలు, మేము బయల్దేరి అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా... అక్కడ దారిలో ఎర్రటి ముద్దమందారాలు అమ్ముతున్నారు. అన్ని మందారపూలు ఒక్క చోట దొరకవు. నాలాగా 108 పూల పూజ నోము పట్టిన వాళ్లకి మందారపూల సేకరణ చాలా కష్టం. వెంటనే నాకొక ఐడియా వచ్చింది. 110 ముద్దమందారాలు కొని, జ్వాలాదేవి గుడి బయట ఉన్న మహాలక్ష్మి ఉపాలయంలో పూజ చేసుకోవాలని. అనుకున్నాను. అదృష్టవశాత్తూ... హ్యాండ్ బాగ్ లో లలితా సహస్రం పుస్తకం వెనుక... లక్ష్మి అష్టోత్తరం ఉంది. కాని ఎవరైనా అడ్డగిస్తే... మనసులో చిన్న సందేహం. గురుజి ని స్మరించుకుని, లోపల కూర్చున్నా... ఆయన దయవల్ల, ఎవరూ ఏమీ అనలేదు. చక్కగా పూజ చేసుకుని, ప్రసాదం నివేదించి, బయటకు వచ్చాను. ఇక్కడ వీళ్ళు తెచ్చే ప్రసాదాలు విగ్రహాల నోటి నిండా పులిమి వెళ్తారు. ఎందుకో మరి... అలా అమ్మవారి దయతో ముద్దమందారాల పూజ పూర్తయింది.



తర్వాత జ్వాలాదేవి నుంచి ధర్మశాల కు బయల్దేరాము. దారిలో కాంగ్రా లోని వజ్రేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. 51 శక్తి పీఠాల్లో,ఇది సతీదేవి ఎడమ రొమ్ము పడిన ప్రాంతమని చెబుతారు. ఈ ఆలయాన్ని మహాభారత కాలంలో పాండవులు, అమ్మవారు స్వప్నంలో కనిపించి ఆదేశించడంతో, నిర్మించారట !  అక్కడినుంచి ధర్మశాల చేరుకొని, మేము ఉన్న హోటల్ కొండమీద ఉన్న ఆలయం దర్శించి, ఎక్కడో కొండల నడుమనుంచి వస్తూ, స్వచ్చమైన నీటితో రాళ్ళతో సయ్యటలాడుతూ ఉరకలేస్తున్న బ్యాస్ నది సొగసులు చూసాము. 

ఆ రోజు సాయంత్రం ధర్మశాల లోని దలైలామా ఆశ్రమం దర్శిద్దామని బయలుదేరితే, కొండ దారిలో విపరీతమైన యాత్రికుల రద్దీ వలన ట్రాఫిక్ జాం అయ్యి, 5 గంటలు అక్కడే ఇరుక్కుని, వెనుదిరిగి వచ్చాము. మర్నాడు ఉదయమే బయలుదేరి, మెక్ లియోడ్ గంజ్ లో ఉన్న దలైలామా ఆలయానికి వెళ్ళాము. ఆ ప్రాంతానికి ఆ పేరు అక్కడ ఒకప్పటి గవర్నర్ అయిన సర్ డోనాల్డ్ ఫ్రీల్ మెక్ లియోడ్ వలన వచ్చిందట.  1959 లో 14 వ దలైలామా అయిన టెంజిన్ గ్యాట్సో ను చైనా ప్రభుత్వం తరిమి కొడితే, భారత్ మెక్ లియోడ్ గంజ్ లో ఉన్న భవంతిలో ఆయనకు ఆశ్రయం ఇచ్చిందట. అప్పటి నుంచి అక్కడ దలైలామా ఆశ్రమం ఏర్పడింది.  ఇక్కడ టిబెటన్లు, బౌద్ధ సన్యాసులు ఎక్కువ. ఏమీ తెలియని పసి ప్రాయంలో తెచ్చి, పిల్లల్ని బౌద్ధసన్యాసులుగా మార్చి, వీళ్ళు మఠాలలో వేసేస్తూ ఉంటారు. 

వేర్వేరు పెద్ద మందిరాలలో ఉన్న వీళ్ళ ప్రధాన గురువులైన సఖ్యముని, అవలోకితేశ్వర, పద్మసంభవుడి అద్భుతమైన విగ్రహాలు, చుట్టూ ఉన్న అందమైన చిత్తరువులు, మనకు కనువిందు చేస్తాయి. ప్రతి మందిరంలోనూ ఇరువైపులా, టిబెటన్ల పవిత్ర గ్రంధాలైన కంజుర్(బుద్ధుడి బోధనలు ) , తంజుర్(బుద్ధుడి బోధల వ్యాఖ్యానాలు ) అనేవి ఉంటాయి. వీళ్ళు ఉపాసించేది అవలోకితేశ్వరుడికి సంబంధించిన ఒక్కటే మంత్రం – దీన్ని మణి మంత్రం అంటారు. ‘ఓం మణి పద్మే హుం’ అనే ఈ సంస్కృత మంత్రం . ఈ మంత్ర జపం జ్ఞానోదయానికి దారి చూపుతుందని వీరి నమ్మకం. ఈ మంత్రాన్ని అనేకమార్లు రాసి, సన్యాసులు ఒక ‘ప్రేయర్ వీల్ (ప్రార్ధనా చక్రం లేక మణి చక్రం ) లో వేస్తారు. ఇది ధర్మ చక్రానికి ప్రతీక అని, దీన్ని తిప్పడం వల్ల, ఒక మనిషికి, ఆ చక్రపు పెట్టెలో ఉన్నన్ని మార్లు, ఆ మంత్రాన్ని చదివిన ఫలం దక్కుతుందని, వారి నమ్మకం. ఇటువంటి ఎన్నో మణి చక్రాలు ఆలయం చుట్టూ అమర్చి ఉండగా, వాటిని యాత్రికులు తిప్పుతూ ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడి నుంచి, ప్రసిద్ధమైన ‘దాల్ లేక్’ ను చూడవచ్చు, ఇది అంత చూడదగ్గ విశేషం కాదు.

మెక్ లియోడ్ గంజ్ నుంచి తిరుగు ప్రయాణంలో కాంగ్రా లో ఉన్న చాముండా దేవి ఆలయాన్ని దర్శించాము. చండముండాసురులను సంహరించినందున దేవికి ‘చాముండా’ అనే పేరు వచ్చింది. ఆలయం పక్కనే పూర్తి వడితో ప్రవహించే ‘బన్ గంగా ‘ నది నయన మనోహరంగా ఉంటుంది. ఈ నదిలో స్నానం సకల పాపహరమని నమ్మే భక్తులు, నది వడికి కొట్టుకుపోకుండా, ప్రభుత్వం నదిలో ప్రవేశాన్ని నిషేధించి, నది పక్కనే, యాత్రికుల స్నానాలకు , నది నీటితో ఒక కొలను ఏర్పాటు చేసింది. అక్కడి మనోజ్ఞమైన వాతావరణం, దేవి ఆశీస్సులతో, మా యాత్ర ముగించుకుని, అర్ధరాత్రికి తిరిగి చండీగర్ చేరుకున్నాము. నవదుర్గలను దర్శించాలని భావించే వారికి, ఆ ఆలయాల జాబితా -

వజ్రేశ్వరి దేవి - కాంగ్రా 
బగాళాముఖి - బన్ ఖండి 
చాముండా దేవి - కాంగ్రా 
చింతపూర్ని దేవి - చింత్పూర్ని 
జ్వాలా దేవి - జ్వాలాముఖి 
నైనా దేవి - బిలాస్పూర్ 
శీతల దేవి - ధర్మశాల మహంతన్ 
వైష్ణో దేవి  - జమ్ముకాశ్మీర్.
మానసా దేవి - పంచకుల, హర్యానా .

ఈ వ్యాసం మొదటి భాగం క్రింది లింక్ లో చదవండి...

“అమ్మ దయ ఉంటే, అన్నీ ఉన్నట్లే ! శ్రీ మాత్రే నమః “ శుభం భూయాత్. 



Sunday, February 1, 2015

పదివేల లెక్క ఎలా ? - ప్రసాద్ కట్టుపల్లి


పదివేల లెక్క ఎలా ? 
- ప్రసాద్ కట్టుపల్లి 

పదివేల తలలు కల ఆదిశేషుడు మిమ్ములను ధన్యుల చేయుగాక అని ఒక చాటుకవి తన ప్రతాపాన్ని ఇలా చూపించాడు అట...
పదియునైదు పదునైదు పదునైదు
నిఱువదైదు నూటయిఱువదైదు
నెలమి మూడునూరు లిన్నూరు మున్నూరు
తలలవాడు మిమ్ము ధన్యుజేయు
ఈపద్యంలో పదివేల లెక్క ఎలా వచ్చిందో చెబుతున్నారు ప్రసాద్ కట్టుపల్లి గారు...

పదియునైదు,,,అనగా 10+5*15
పదునైదు పదునైదు 15*15*15....3375
నిరువదైదు నూటనిరువదైదు 25*125......3125.
నెలమి మూడునూరులు ,,.నెల అనగా స్థానము,,,పున్నమ.చంద్రుడు నెలవంక మాసము స్త్రీ శిరో భూషణము అను అర్ధములుకలవు...ఇక్కడ నెలమి స్థానము జరిపి,,లేదా పున్నమ అనేఅర్ధం తీసుకొని 300లకు మరో 0 చేర్చినచో,,,3000
ఇప్పటికి 3375+3125+3000****9500
ఇన్నూరు,,,,200
మున్నూరు,300
9500+200+300**10.000..సరిపోయిందా .,,,మిత్రులూ,.,.



‘రాతి మనసు చదివిన ‘ శిల్పి

‘రాతి మనసు చదివిన ‘ శిల్పి 
-----------------------------------
భావరాజు పద్మిని – 1/2/15 

ఒక స్వప్నంలో... అతనికి ఒక అడవిలో ఒక గొప్ప రాజ్యం గోచరించింది. అది గోచరించిన చోట చూస్తే, ఇప్పుడు అడవి ఉంది. ఆ అడవినే తన స్వప్నంలో కనిపించిన విధంగా మలిచేస్తే... అనుకున్నాడు. అతని వెనుక ఉన్న సైన్యం... అతనొక్కడే ! పోనీ అతను శిల్పా , అదీ కాదు. అయినా, పట్టువిడని అంతటి ఉక్కు సంకల్పం ఎలా కలిగిందో తెలీదు. అడవులు నరికాడు, రాళ్ళు తొలగించాడు... చక్కటి ఆకృతి ఉన్న రాళ్ళను తన సైకిల్ పై మోసుకొచ్చాడు. వ్యర్ధ పదార్ధాలు సేకరించాడు. అడవిలో తానుండి, పనిచేసుకునేందుకు ఒక రాతి పలకల గూటిని నిర్మించుకున్నాడు.  ఇవన్నీ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే, సాయంత్రం తన బాధ్యతలు ముగియగానే, మొదలుపెట్టి, చేసేవాడు... అదీ, “రహస్యంగా !” ఇలా దాదాపు 18 ఏళ్ళు కష్టపడ్డారు...

ఫలితం... కష్టమైనా, ఇష్టమైన పనిని ఒక తపస్సులా, యోగనిష్ట లా చేసినందుకు... ఒక అద్భుతమైన రాతి సామ్రాజ్యం అక్కడ ఏర్పడింది. అతని శ్రమకు ఫలితంగా , అతనికి ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ని బహుకరించింది. ఆయనే ‘నెక్ చంద్’. 

నెక్ చంద్ ‘బెరియన్ కలాన్’ అనే గ్రామంలో 1924 లో జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం పాకిస్థాన్ లో ఉంది. భారత విభజన సమయంలో వారి కుటుంబం భారత్ కు వచ్చేసింది. అయినా, అతని స్మృతి పధంలో అతని గ్రామం, అక్కడి ఇళ్ళు, జలపాతాలు అన్నీ అలాగే ఉండిపోయాయి. 



                            

చండీగర్ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ‘నెక్ చంద్’ కు  ఒకరోజున ఒక మంచి కల వచ్చింది... ఒక గొప్ప ‘సుఖ్రాని’ అనే సామ్రాజ్యం ఒక అటవీప్రాంతంలో ఉన్నట్లు గోచరించింది. సభాస్థలి, సంగీతకారులు, నాట్యకారులు, ఆకాశ హర్మ్యాలు, సుందర జలపాతాలు... ఓహ్, అద్భుతం ! అయితే, ఆయన కలే కదా, అని దాన్ని, మర్చిపోలేదు, నావల్ల ఏమౌతుంది, అని వదిలెయ్యలేదు... తాను స్వప్నంలో కాంచిన ఆ గొప్ప రాజ్యాన్ని, అతను అక్కడే నిర్మించాలని అనుకున్నాడు. తన ఉద్యానవనానికై చాంద్ ,సుఖ్నా సరస్సు దగ్గరలోని అరణ్యాన్ని ఎంచుకున్నారు. ఆ సంకల్పం ఎట్టకేలకు , ఆయన 1957 లో రహస్యంగా, వ్యర్ధపదార్ధాలతో ఒక ఉద్యానవనం మొదలుపెట్టేలా చేసింది.

ఆయన ఉద్యోగ విధులు ముగిసాకా, శివాలిక్ కొండల దిగువన తిరుగుతూ, పక్షి ఆకృతిలో , వివిధ జంతువుల ఆకారాల్లో, మనిషి ఆకారంలో ఉన్న రాళ్ళను ఏరి, తన సైకిల్ పై తీసుకు వచ్చేవారు. తాను ఉండి, పని చేసుకునేందుకు వీలుగా ఒక రాతి గుడిసెను ఏర్పరచుకున్నారు. మొదటి ఏడేళ్ళు గృహాల నుంచి, ఇండస్ట్రీ ల నుంచి, వీధుల నుంచి వ్యర్ధ పదార్ధాల సేకరణలో గడిపారు. విరిగిన గాజు ముక్కలు, పగిలిన కుండలు, సిరామిక్ టైల్స్, మాడిన బుల్బ్ లు, బాటిల్స్, మంగలి వద్ద నుంచి కత్తిరించిన జుట్టు, ఇవే అతని ముడి పదార్ధాలు. క్రమంగా అవన్నీ అద్భుతమైన 20,000 కళాకృతులుగా రూపుదిద్దుకున్నాయి. 12 ఎకరాల్లో నాట్యకారులు, సంగీత వాద్య కారులు, వివిధ జంతువులు, రాతి మేడలు, తోరణాలు, జలపాతాలు, సింహాసనం, కళారూపాలతో  ‘సుఖ్రాని’ అద్భుత సామ్రాజ్యం నిర్మించారు. ఒక సన్నటి దారి గుండా వెళ్తుంటే, ముందర ఏమి ఒస్తుందో తెలియని ఉద్విగ్నత ! మరొక్క క్షణం ఆగితే, కళ్ళముందు మరో అద్భుత ప్రపంచం... ఇలా సాగుతుంది చండీగర్ రాక్ గార్డెన్స్ లో సందర్శకుల పయనం. ‘ఒక్క మనిషి, ఇంత అద్భుతాన్ని సృష్టించగలడా ?’, అని ఆశ్చర్యపోనివారు ఉండరు. 

18 ఏళ్ళు చాంద్ మౌనంగా నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని, 1973 లో అడవిలో ఆంటి – మలేరియా టీం లో పనిచేస్తున్న ఎస్.కె. శర్మ గుర్తించారు. ఇది అటవీ ప్రాంతం కనుక, చాంద్ నిర్మాణాలు అన్నీ అక్రమమైనవని, తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, చాంద్ ప్రజాభిప్రాయం సేకరించి, ఇదొక గొప్ప పర్యాటక స్థలం కాగలదని నిరూపించాడు. 1975 లో దీన్ని అధికారికంగా గుర్తించారు. 1976 నుంచి ఇది సందర్శకుల కోసం తెరిచారు. తర్వాత ఈ  వనాన్ని మరిన్ని శిల్పాలతో విస్తృత పరిచారు. అటుపై,  చాంద్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పలు విదేశీ సంస్థలు ఆయన్ను సత్కరించాయి. విదేశీ మ్యుసియం లలో చాంద్ శిల్పాలు చోటు సంపాదించుకున్నాయి. ఇప్పుడు 90 ఏళ్ళ వయసులో, రాళ్ళతో రాగాలు పలికించిన ఆ మౌనశిల్పి, నవ్వుతూ, అప్పుడప్పుడూ, తన ‘సుఖ్రాని’ సామ్రాజ్యం లోనే దర్శమిస్తారు.
ఆయన్ను చూస్తే, ఎవరికైనా అనిపిస్తుంది. “మనిషి తలచుకుంటే, ఏమైనా చెయ్యగలడు !” అని. మీరూ చండీగర్ వస్తే, వ్యర్ధాలతో నిర్మించిన ఈ అర్ధవంతమైన  సుందర ఉద్యానవనం తప్పక సందర్శించండి !

Wednesday, January 28, 2015

వాఘా ఇండో- పాక్ సరిహద్దు దళాల వేడుకలు

వాఘా ఇండో- పాక్ సరిహద్దు దళాల వేడుకలు 
-----------------------------------------------------
భావరాజు పద్మిని - 28/1/15  

ఒక ప్రక్క 'హిందుస్థాన్ జిందాబాద్... వందే మాతరం ...' అన్న నినాదాలు.
మరో ప్రక్క ' పాకిస్థాన్ జిందాబాద్..' అన్న నినాదాలు... ఇదేదో క్రికెట్ మ్యాచ్ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఇది అమృత్సర్ వద్దనున్న భారత్  సరిహద్దులోని చివరి గ్రామమైన 'అటారి' వద్ద గోచరించే హృద్యమైన దృశ్యం.

ఇటువైపు మహాత్మాగాంధీ బొమ్మ ఉన్న  స్టేడియం లో మీకు గోచరిస్తున్న వారంతా భారతీయులు. అటువైపు మొహమ్మద్ జిన్నా  చిత్రం ఉన్న గేటుకు ఆవల మీకు కనిపించే వారంతా పాకిస్థానీయులు.

భారత్, పాక్ సరిహద్దు దళాలు కలిసి, సాయంత్రం వేళ 'వాఘా' వద్ద, జండా దింపే ప్రక్రియను ఒక వేడుకకా చెయ్యాలని అనుకున్నారు. సాయంత్రం వేళ, కాసేపు, ఇటు భారత్ గేటు, అటు పాకిస్థాన్ గేటు  తీస్తారు. ఆ సమయంలో మన స్త్రీ, పురుష దళాలు అటువైపు వెళ్తాయి. అలాగే, పాకిస్థాన్ కు చెందిన దళాలు ఇటువైపు వస్తాయి. ఒకరిని ఒకరు చూసి, మీసాలు మెలేసి, తొడ కొట్టి, బూట్లు ఎత్తుతారు. ఇది కేవలం ఒక చిన్న వినోదం కోసం మాత్రమేనండోయ్...



మేము వెళ్లేసరికి స్టేడియం మొత్తం నిండిపోయింది. అటు పాకిస్థాన్ వైపు జనం చాలా పల్చగా ఉన్నారు.  మధ్యలో గుంపుగా మూగిన కొందరు భారతీయులు, 'ఏ మేరా ఇండియా...' పాటకు, ఆ తర్వాత మరికొన్ని పాటలకు కేరింతలు కొడుతూ, నృత్యం చేసారు. కొందరు బుగ్గలపై భారత జండా టాటూ లు వేయించుకుని వచ్చారు. కొందరు జండాలు తెచ్చి, ఊపుతూ ఆనందించారు.

గేటు తెరిచే సమయానికి, ఈలలు, గోలలు, జై భారత్ అన్న నినాదాలతో... స్టేడియం మొత్తం మార్మ్రోగిపోయింది.  ఇల్లు, కుటుంబానికి దూరంగా ఎక్కడో ఉంటూ, మన కోసం అహర్నిశలూ పనిచేస్తున్న  సరిహద్దు దళాలకు ఇది ఆటవిడుపు. వారు అప్రమత్తంగా ఉంటూనే, అడిగిన వారితో, పిల్లలతో ఫోటోలు తీయించుకుంటూ ఆనందించారు. దేశభక్తి నరనరానా ప్రవహిస్తూ ఉండగా, అది ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన వేడుక. వీలుంటే, మీరు కూడా నయనానందకరమైన ఈ వేడుకలో ఒక్కమారైనా, తప్పక పాల్గొనండి.

Tuesday, January 27, 2015

గురువుల ‘అమృత పాతం ‘ – అమృత్సర్

గురువుల ‘అమృత పాతం ‘ – అమృత్సర్ 
---------------------------------------------
భావరాజు పద్మిని - 27/01/2015 

నా దృష్టిలో...’ మతం అంటే మనిషిలో సత్ పరివర్తన తీసుకురాగలిగింది...’ . నిజంగా ఆ మతంలోనే పుట్టి, అందులోని సిద్ధాంతాలను ఔపాసన పట్టినా, త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినా, అది ఆ మనిషిలోని క్రూరత్వాన్ని/దుష్టత్వాన్ని అణచి, సన్మార్గంలోకి నడిపించలేనప్పుడు, ఆ మతం వ్యర్ధం !

అలా మనిషిలో అంతర్గత మార్పును తీసుకువచ్చే, నేను ఇక్కడ చూసిన గొప్ప మతం సిక్కు మతం. సాధారణంగా వీరికి కొండల్ని పిండి చేసేంత బలం ఉంటుంది. అలాగే ఏనుగు కుంభస్థలాన్ని నేరుగా డీ కొనే ధైర్యం ఉంటుంది. సిక్కు పురుషులు యోధులు, స్త్రీలు కూడా ధీరలే ! అయితే, వారు ఎన్నడూ ఇతరులకు హాని తలపెట్టే ఆలోచనలు చెయ్యరు. వారి బలాన్ని బలహీనులమీద చూపి, మీసాలు మెలేసే నీచత్వానికి దిగజారరు. ఎందుకని ? ఉక్కు వంటి సిక్కు మనసుల్ని మలచి, వారి యుక్తులను సరైన దిశలో మలచిన ఘనత మాత్రం దశావతారాల వంటి వారి పది మంది గురువులదే !

పాత అమృత్సర్ నగరం ఎనిమిది దిక్కుల లోనూ, 8 ప్రాకారాలు ఉన్న కోట గోడచే ఆవరించబడిన ప్రాకారంలో ఉండేది. లాహోర్ నుంచి, మన దేశంలోకి చొరబడిన మొఘల్ రాజులకు, బ్రిటిష్ వారికి, అందరికీ మొదట గోచరించేది, కంచుకోట వంటి ఈ అమృత్సర్ నగరం. ముందా కోటను వశపరచుకోవాలి , ఎలా ? ఎంతటి సైనిక బలగం ఉన్నా, దుర్భేద్యమైన ఆ కోట వైపు, ధీరులైన సిక్కుల వైపు చూడాలంటేనే వారికి భయం ! అందుకే మొదట సిక్కు గురువులను తమ మతం  లోకి మార్చాలని అనుకున్నారు. గురువు దారి తప్పితే, మిగిలిన వారిని సునాయాసంగా మార్చవచ్చని, వారిని హింసించారు. సిక్కు గురువులలో కొంతమందిని మొఘలులు, బ్రిటిష్ వారు ఎత్తుకుపోయి, ఖండ ఖండాలుగా నరికి చంపమని శిక్ష వేసినప్పుడు... వాళ్ళు మౌనంగా తమ చేతులూ, కాళ్ళు అప్పగించి, గురు గ్రంధం లోని శ్లోకాలు చదువుతూ, ఆ చంపేవారి మనసుల్లోని క్రూరత్వాన్ని మార్చమని, దైవాన్ని ప్రార్ధిస్తూ, కన్ను మూశారు ! అంతే తప్ప, మతం, ధర్మం మార్చుకోమని చెప్పారు. గురు దీప్ సింగ్ గాధ అయితే, అత్యంత ఆశ్చర్యకరం ! ఈయన స్వర్ణ దేవాలయాన్ని ముట్టడించిన వారిపై దాడికి దిగగా, వారు ఆయన శిరస్సు ఖండించారు. ఆయన ఏ మాత్రం చలించకుండా, తెగిన తన తలను చేతబట్టుకుని, మిగిలిన శత్రుసంహారం చేసి, చివరికి తన నెలవు చేరుకొని, తెగిన తన తలను వదిలేసారట ! గురువులు సర్వసమర్ధులని, దేహానికి మాత్రమే పరిమితం కారని వారి గాధ నిరూపిస్తుంది.

   అంగబలం, అర్ధబలం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తుంది. 1748 లో లాహోర్ కు గవర్నర్ గా వచ్చిన ‘మీర్ మన్ను‘ హయాంలో జరిగిన దురాగాతాలైతే, చరిత్ర చెక్కిట చెరగని రక్తపు మరకలే అనవచ్చు ! ఈ నాటికీ భారత జాతి చరిత్రలోనే ఇటువంటి దురాగతాల్ని మనం చూసి ఉండము అంటే, అతిశయోక్తి కాదేమో !
కోట బయటే ఉంటూ, తమకు అప్పగించిన ఒక్కొక్క సిక్కు తలకు, 10 రూపాయల బహుమానం ప్రకటించారు. ‘డివైడ్ అండ్ రూల్’ లాగా వారిలో వారికే భేదాలు కల్పించి, సిక్కు మగవారిని సంహరించారు. అతనికి భయపడి, చాలామంది కోట వదిలి, అడవులకు వెళ్ళిపోయారు. మతం మార్చుకోని, ప్రతి ఒక్కరినీ నిర్దయగా సంహరించారు. మిగిలిన ఆడవారిని, పిల్లల్ని కారాగారానికి తరలించారు. అమ్మల కళ్ళ ఎదుటే, వారి బిడ్డల్ని సంహరించి, ఆ మాంస ఖండాలను తల్లుల మెడలో వేసారు. స్త్రీల చేత రోజుకు 450 కిలోల తిండిగింజల్ని నూరిస్తూ, వాళ్లకు రోజుకు కేవలం ఒక చిన్న రొట్టె, ఒక గ్లాస్ నీరు మాత్రమే ఇచ్చేవారు. పని చేసే శక్తి లేని స్త్రీల గుండెపై ఒక పెద్ద బండరాయిని పెట్టి, చంపారు. కొందరిని యధేచ్చగా బలాత్కరించారు. అయినా ఆ స్త్రీలు ఏం చేసారో తెలుసా ! గురు నామాన్ని, గురు గ్రంథ సాహిబ్ లోని శ్లోకాల్ని పాడుకుంటూ హింసను మౌనంగా భరించారు. ఎందుకంటే... వారికి వారి గురువులపై అచంచల విశ్వాసం ! కొంత కాలానికి క్రూరుడైన మీర్ మన్ను మరణించగా, సిక్కులంతా ఏకమై దాడి చేసి, మిగిలిన తమ స్త్రీలకు, పిల్లలకు విముక్తి కల్పించారు.



ఇంతకూ వారి జీవితం ద్వారా వారు బోధించినది ఏమిటి ? తమ దేశం కోసం , జాతి కోసం, ధర్మం కోసం, సాటివారి శ్రేయస్సు కోసం, ప్రాణాలనైనా తృణప్రాయంగా భావించి అర్పించమని, ఆచరణాత్మకంగా చూపారు. అందుకే, ప్రస్తుతం భారతావని సైన్యంలో అధిక శాతం సిక్కులే ! అంతటి త్యాగధనులు వారు.

‘అమృత్సర్’ పేరుకు తగ్గట్టు... మన మనసుల్లో అమృత సరమై ప్రవహిస్తుంది. అక్కడ రాజైనా, పేదైనా ఒక్కటే ! అందరూ ఒక్క వరుసలో వెళ్లి, దర్శించుకోవాల్సిందే ! అక్కడికి వెళ్ళినవారు తప్పక భోజనం చేసి తీరాలన్న నియమం ఉంది. అదికూడా, ఏ రకమైన వివక్ష లేకుండా, ఎంతటి ఘనుడైనా, భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు, రెండు చేతులూ చాచి, ‘దేహీ’ అన్నట్లుగా పట్టి, రొట్టెను స్వీకరించి, తినాల్సిందే ! అంతేకాదు, ఇక్కడ మరో విశేషం ఉంది. ఈ పాలరాతి ఆలయం అత్యంత శుభ్రంగా ఉంటుంది. ఎలాగో తెలుసా ? కుప్పలుతెప్పలుగా ఆలయ శుభ్రతకు సిబ్బందిని పెట్టుకున్నందుకు కాదు ! గురు భక్తుల సేవతో ! ఆ ఆలయంలో ఈరోజున సేవకు పేర్లు నమోదు చేసుకున్నవారికి అవకాశం వచ్చేందుకు దాదాపు పదేళ్ళు పడుతుందట ! అంటే, వారిలో సేవానిరతి యెంత అధికంగా ఉందో, మీరు ఊహించుకోవచ్చు. భక్తులు పాలరాతి మెట్లపై జారిపోకుండా, రబ్బరు తివాసీలు పరిచారు. ఒక ప్రక్క మనం నడుస్తుంటే, మరో ప్రక్క, తివాసీల పైనుండి, గుడ్డతో, చీపుర్లతో, మన పాద ధూళిని శుభ్రం చేస్తుంటారు కొందరు ! ఆలయం చుట్టూ ఉన్న, పవిత్రమైన ఆ దుఃఖ నివారిణి సరస్సులో దిగి, ఆ జలాన్ని తమ శిరస్సుపై జల్లుకుని, స్నానాలు చేసి, త్రాగి వచ్చే భక్తుల పాదముద్రల్ని, తడి గుడ్డలతో శుభ్రం చేస్తూ ఉంటారు కొందరు. పెద్ద పెద్ద కోట్లు తొడుక్కున్న ధనవంతులు, అక్కడి భక్తులకు ఆలయం వెలుపల నాలుగు దిశల్లో ఉన్న నిర్మాణాలలో, నీటిని అందించి, ఆ ఎంగిలి బొచ్చెలు కడుగుతూ కనిపిస్తారు. సాంఘికంగా గొప్ప గుర్తింపు ఉన్నవారు సైతం, అక్కడ ఉల్లిపాయలు తరిగి, ఆ కన్నీటిని ఆనందభాష్పాలుగా భావిస్తారు. భక్తులకు అందించే ‘లంగరు’ అనబడే భోజనం కోసం అవసరమైన ప్లేట్ ల సరఫరా, వంట సామాన్లు తేవడం, వండడం, బస్తాలకు బస్తాల ఉల్లి, బంగాళాదుంపలు, అల్లం , ఇతర కూరలు తరగడం, వెల్లుల్లి ఒలవడం, వడ్డించడం, తిన్న పళ్ళాలు తోమడం, తిరిగి కడిగిన పళ్ళాలు అందించడం వరకు... అంతా భక్తులే ఒక సేవగా భావించి చేస్తారు. వారికి, అక్కడకు తమ గురువు ఏ రూపంలోనైనా వచ్చి, తమ ముందే తిరుగుతారని ఒక గురి. అందుకే చేసే ప్రతి సేవా... గురుసేవగా భావించి, అత్యంత ప్రేమభావనతో చేస్తారు. ఆ సాత్విక వాతావరణంలోకి అడుగిడిన ఏ హృదయమైనా, వారి సేవాభావం చూసి, ద్రవించి, మున్యాశ్రమంలోకి వచ్చి తన క్రూరత్వాన్ని మరచిన సింహంలాగా ,పరిణామం చెందుతుంది.
ఒక్క స్వర్ణ దేవాలయంలోనే ఈ సేవలన్నీ జరుగుతాయని, మీరు అనుకుంటే, పొరబడినట్టే ! పంజాబ్ లో ఉంటున్న ఏ ఒక్కరూ... ఆకలితో పడుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే... ఇక్కడున్న ప్రతి గురు ద్వారా లోనూ, విధిగా, పేదా- గొప్పా తారతమ్యం లేకుండా భోజనం పంచుతారు. అంతే కాదు, వీరిలో సేవాభావం యెంత అధికమంటే... వేసవిలో కుటీరాలు వేసి, ప్రతి అర కిలోమీటర్ పరిధిలో షర్బత్ పంచుతారు. వారం, వర్జ్యం, ముహూర్తం తో పని లేకుండా, వారికి అనువైన ఏ రోజైనా, నడి రోడ్డుపై డేరాలు ఏర్పరచి, అక్కడే వండించి, రొట్టెలు, కూర, పూరీలు, పప్పు, హల్వా... వంటివి విరివిగా పంచుతారు. కారుల్లో తిరిగే దొరబాబులు సైతం పక్కకి వాహనాలు నిలిపి, ఇది గురుప్రసాదంగా భావించి, అత్యంత ఆదర భావంతో స్వీకరించి తింటారు. అలా తినగలగడం అదృష్టంగా భావిస్తారు.

ఇప్పుడు చెప్పండి... పిడిగుద్దుతో ఇతరుల్ని పిండి చెయ్యగల శక్తి ఉన్నా... ఇతరులను తమ గురువుగా భావించి, పాదధూళి తుడిచెంత నిరాడంబరత వీరికి ఎలా వచ్చింది. తమ బలాన్ని సరైన దిశలో వాడి, సన్మార్గంలో నడిచే సాధు వర్తన వీరికి ఎలా వచ్చింది. తమ గురువుల బోధల్ని చదివి, అక్షరాలా పాటిస్తున్నారు. సర్దార్ లు వీరులు, దేశభక్తులు, త్యాగధనులు, సేవానిరతులు, అన్నింటినీ మించి, గొప్ప గురుభక్తులు ... ఎందరికో ఆదర్శవంతులు ! వీరు తిరిగే పుణ్య భూమిలో ఉంటున్నందుకు నేను గర్వపడుతున్నాను. వీరిలోని ఒక్కొక్క భక్త పరమాణువుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

మంచి ఎవరివద్ద ఉన్నా, చూసి నేర్చుకోమన్నారు. మరి, వీరి నుంచి మనం నేర్చుకోదగ్గ అంశాలను మరొక్కసారి గమనించి, నాతో పాటు మీరూ సగర్వంగా అనండి...” సర్దార్ దిల్దార్ హై, అసర్దార్ హై, ... సింగ్ ఈస్ కింగ్ “ అని.

(మొన్న అమృత్సర్ దర్శించినప్పుడు నా మనోభావాలకు అక్షరరూపం...)